నిఖిల్‌ పెళ్లి సింపుల్‌గా జరిగింది: యడియూరప్ప | CM Yediyurappa Comments Over Nikhil Gowda Marriage | Sakshi
Sakshi News home page

దానిపై చర్చలు అనవసరం: యడియూరప్ప

Apr 18 2020 6:55 PM | Updated on Apr 18 2020 8:21 PM

CM Yediyurappa Comments Over Nikhil Gowda Marriage - Sakshi

బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, శాండల్‌వుడ్‌ హీరో నిఖిల్‌ గౌడ వివాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై ముఖ్యమంత్రి యడియూరప్ప మరోసారి స్పందించారు. కుమారస్వామి కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు. శనివారం కరోనా వైరస్‌పై జరిగిన చర్చలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘పెళ్లి జరపటానికి కావాల్సిన అన్ని అనుమతులు వారు తీసుకున్నారు. పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా జరిపించారు. దాని గురించి చర్చలు అనవసరం. వారి పరిధిలో వారు చాలా చక్కగా చేశారు, దానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’నని అన్నారు. కాగా, నిఖిల్‌ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ( ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! )

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ముఖ్యులైన కొద్దిమద్ది అతిధుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతిధుల్లో ఎవరూ కూడా మాస్క్‌లు ధరించకపోవటం, సామాజిక దూరాన్ని పాటించపోవటం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్న వేళ స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ సంఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. అయితే ఈ వివాహ వేడుకకు హాజరైన కొద్దిమంది ముఖ్యుల్లో సీఎం యడియూరప్ప కూడా ఉండటం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement