‘కశ్మీర్లో ఏ ఒక్క ప్రాణం పోలేదు’
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో ఆంక్షల కారణంగా ఏ ఒక్క ప్రాణం కూడా పోలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ నుంచి అక్కడ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై సుబ్రహ్మణ్యం శుక్రవారం శ్రీనగర్లో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ లోయలో టెలిఫోన్ లైన్లు, ఇతర సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఈ సేవలు కొంతమేర అందుబాటులోకి వస్తాయని చెప్పారు. నిషేధిత సంస్థలతోపాటు, లష్కరే తోయిబా వంటి ఉగ్ర సంస్థలతో ముప్పు పొంచి ఉన్నందున దశల వారీగా ఆంక్షలు సడలించాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగంలోని అంశాలు..
- టెలిఫోన్ సేవలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి నెమ్మదిగా అందుబాటులోకి వస్తాయి. సమాచార వ్యవస్థపై ఆంక్షలను దశలవారీగా ఎత్తివేస్తాం. బీఎస్ఎన్ఎల్ సేవలను పూర్తి స్థాయిలో పునరుద్దరించడానికి మరికొంత సమయం పడుతుంది.
- పాఠశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు నేటి(శుక్రవారం) నుంచి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి.
- మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై రాజకీయ నిర్భంధాన్ని ఎత్తివేయడం జరిగింది. ఇలాంటి అంశాలను రోజువారీగా సమీక్షించాల్సిన అవసరం ఉంది.
- శాంతి భద్రతలను కాపాడటం కోసం చట్టంలోని నిబంధనల ప్రకారం కొందరు వ్యక్తులను ముందస్తుగా నిర్భంధించడం కూడా జరిగింది
- ఆంక్షల కారణంగా ఏ ఒక్కరు కూడా మృతి చెందలేదు. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలు ఎన్ని రకాలుగా ప్రయత్నించిన ఒక్క ప్రాణం కూడా పోకుండా చర్యలు చేపట్టాం.
- ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ ప్రజలకు కనీస అవసరాలైన ఆహారం, మెడిసిన్ సరఫరా చేశాం. శాటిలైట్ చానళ్లు, న్యూస్ పేపర్స్ను అందుబాటులో ఉంచాం. అలాగే వైద్య సేవలను కూడా అందించాం.
- మొత్తం 22 జిల్లాలు ఉండగా.. 12 జిల్లాలో సాధారణ పరిస్థితులునెలకొన్నాయి. మరో ఐదు జిల్లాలో కొద్ది పాటి అంక్షలు ఉన్నాయి.
- ప్రజా రవాణా అందుబాటులోకి రావాల్సి ఉంది.