జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో పరి పాలనా వ్యయం 6శాతం సీలింగ్ కంటే అధికంగా ఉండడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
‘ఉపాధి హామీ పథకం’ పరిపాలనా వ్యయంపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథ కం అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలలో పరి పాలనా వ్యయం 6శాతం సీలింగ్ కంటే అధికంగా ఉండడంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. శాఖకు చెందిన మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నివేదిక ప్రకారం ఏపీలో 2015-16గాను పరిపాలనా వ్యయం 8.29 శాతం, తెలంగాణలో 13.91 శాతంగా ఉంది. ఈ విషయమై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. అలాగే 6శాతం సీలింగ్ కంటే అధికంగా ఉన్న వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలంది.
అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉపాధిహామీ పథకానికి సంబంధించిన పనులు అసంపూర్తిగా ఉండడంపై పెదవి విరిచింది. ఏపీలో ఈ పథకం అరంభమైనప్పటి నుంచి గతేడాది మార్చి 31 వరకూ 76.70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 18 వరకు కేవలం 5.88 శాతం, తెలంగాణలో ఈ నెల 22 వరకు 21.4 శాతం పనులే పూర్తయ్యాయి. 2015 మార్చికి ఏపీలో 1,35,688, తెలంగాణలో 5,99,191 అసంపూర్తి పనులను ఈ జూలై 31 కల్లా పూర్తి చేయాలంది. వ్యవసాయం అనుబంధ కార్యకలాపాలకు జిల్లా స్థాయిలో వ్యయ పరిమితి 60శాతం కంటే తక్కువగా ఏపీలోని అనంతపురం, తెలంగాణలోని వరంగల్ జిల్లాల్లో జరిగిందని శాఖ పేర్కొంది.