తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ భిన్నవాతావరణంలో ఇరు రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అకాల వర్షాలతో రైతులూ పంట నష్టపోతున్నారు. ఈ లోపు వాతావరణ శాఖ ఇరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
ద్రోణి ప్రభావంతో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బలమైన ఈదురు గాలులు సహా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అదే సమయంలో..
తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరాయి. వడగాలులు ముప్పు కూడా పొంచి ఉందని.. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఏపీలో శుక్ర, శనివారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవడం సహా గంటకు సుమారు 40 - 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. అలాగే.. ఇటు తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంతో వేడి, తేమ సహా అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వర్షాలతో ఇదే తరహా వాతావరణం నెలకొంటుందని పేర్కొంది.
మరో మూడు రోజులపాటు..
ఏపీలోని కృష్ణా జిల్లా పాలకాయతిప్ప వద్ద సముద్రంను చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోతున్నారు. గత రెండు రోజులుగా వెయ్యి మీటర్లు ముందుకు చొచ్చుకుని వచ్చింది. ఏడు నుంచి ఎనిమిది మీటర్ల ఎత్తున సమద్రుపు అలలు ఎగసిపడుతున్నాయి. ఇన్నేళ్లలో.. ఈ సీజన్లో ఎప్పుడూ సముద్రాన్ని ఇలా చూడలేదని మత్స్యకారులు చెబుతున్నారు.
చల్లటి కబురు
వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది ముందుగానే రుతుపవనాలు ప్రవేశిస్తాయని.. మే రెండో లేదంటే మూడో వారం తీరాన్ని తాకుతాయని తెలిపింది.


