‘48 గంటల’ నిబంధన సమీక్షకు కమిటీ
న్యూఢిల్లీ: పోలింగ్కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని ఆపివేయాలనే నిబంధనపై సవరణలు సూచించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నిబంధనల ప్రకారం ప్రచార పర్వాన్ని నిలిపివేస్తున్న పార్టీలు, అభ్యర్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఇతర మార్గాల్లో ప్రచారం కొనసాగిస్తున్నట్లు సీఈసీ గుర్తించింది. ఇటీవలి గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిక్కి సమావేశం, టీవీల్లో రాహుల్ గాంధీ ఇంటర్వ్యూలు, ప్రచారం ముగిశాక బీజేపీ మ్యానిఫెస్టో విడుదల.. వంటివి వివాదాస్పదంగా మారాయి. ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు సమాచార, ప్రసార, న్యాయ, ఐటీ మంత్రిత్వ శాఖలతోపాటు నేషనల్ బ్రాడ్కాస్టర్స్ అసోసియేషన్లు, ప్రెస్ కౌన్సిల్ ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.