సీబీఐ ఏడీ నాగేశ్వరరావుకు డిమోషన్
ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అదనపు డైరెక్టర్ బాధ్యతల నుంచి మన్నెం నాగేశ్వరరావును తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. 1986 ఒడిశా కేడర్కు చెందిన ఆయనను అగ్నిమాపక దళ, పౌర రక్షణ, హోంగార్డుల డైరెక్టర్ జనరల్గా బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ నియామకాల కమిటీ సమావేశం జరిగిన కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీబీఐతో పోలిస్తే ఫైర్ సర్వీసెస్ను తక్కువ కేటగిరీ డిపార్ట్మెంట్గా భావిస్తారు.
సీబీఐ అదనపు డైరెక్టర్గా ఉన్న ఆయనను అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి తగ్గించినట్లవుతుంది. అంటే ఫైర్ సర్వీసెస్ డీజీ పోస్టు.. సీబీఐలో అదనపు డైరెక్టర్ జనరల్ స్థాయికి సమానమైంది. ఒక రకంగా ఆయనకు ఇది డిమోషన్ లాంటిది. తాజా బదిలీతో ఆయన తన పదవీకాలం ముగిసే(జూలై 31, 2020) వరకు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు ఆయన ఇదే కేడర్లో కొనసాగాల్సి ఉంది. ఇంతకుముందు కూడా కేంద్ర ప్రభుత్వం గత సీబీఐ చీఫ్ అలోక్ వర్మను సైతం ఇదే విధంగా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు బదిలీ చేయగా.. ఆయన ఆ పదవిని తీసుకునేందుకు అప్పట్లో తిరస్కరించారు. నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా రెండు సార్లు నియమితులయ్యారు. కాగా నాగేశ్వరరావు స్వస్థలం తెలంగాణలోని జయశంకర్ జిల్లా(ఉమ్మడి వరంగల్) మండపేట మండలం బోర్నర్సాపూర్ గ్రామం. 1986 ఒడిశా క్యాడర్కు చెందిన నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా రెండుసార్లు నియమితులయ్యారు.