‘చివరిసారిగా నాతో బాగా చదువుకో అని చెప్పారు’

In Bulandshahr Killed Cop Says To Work On My Weak Subjects - Sakshi

లక్నో : మా నాన్న మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దారు.. మతం పేరుతో ప్రజలు హింసకు పాల్పడటాన్ని ఆయన ఏ మాత్రం సహించే వారు కారు అంటున్నారు అభిషేక్‌. నిన్న యూపీలోని బులందషహర్‌లో గోరక్షకులకు, పోలీసులకు నడుమ జరిగిన దాడుల్లో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ సింగ్‌ మరణించిన సంగతి తెలిసింది. మరణించిన సుబోధ్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు అభిషేక్‌.. ఇంటర్‌ పూర్తి చేశాడు. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్న అభిషేక్‌ ప్రపంచం.. తండ్రి మరణవార్తతో ఒక్కసారిగా మూగ బోయింది.

ఈ సందర్భంగా అభిషేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడానికి ఒక రోజు ముందు నేను మా నాన్నతో మాట్లాడాను. అప్పుడు ఆయన వీక్‌గా ఉన్న సబెక్ట్‌ల మీద దృష్టి సారించాల్సిందిగా నాకు సూచించారు . గత పరీక్షల్లో ఏ సబ్జెక్ట్‌లో తక్కువ మార్కులు వచ్చాయో వాటి మీద బాగా ఫోకస్‌ చేయమని చెప్పారు అంటూ గుర్తు చేసుకున్నారు. అంతేకాక నాన్న మాతో ఎప్పుడు మీ ఆహారాన్ని మీరు సంపాదించుకున్న రోజున నేను మరణించినా పర్వాలేదు అని చెప్పేవారు. కొన్ని సార్లు కొన్ని కేసులను విచారించకూడదంటూ ఆయన మీద ఒత్తిడి వచ్చేది. కానీ ఆయన అలాంటి వాటికి ఎప్పుడు భయపడలేదు అని తెలిపారు. సుబోధ్‌ సింగ్‌ పెద్ద కొడుకు అతని అంత్యక్రియలను నిర్వహించాడు.

చట్టవిరుద్ధంగా ఏర్పాటైన కబేళాల్లో గోవధ జరుగుతుందంటూ స్ధానికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. బులంద్‌షహర్‌-సైనా రహదారిపై ఆందోళనకు దిగిన పలు హిందూ సంస్థల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. హిందూ యువవాహని, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు వాహనాలను దగ్ధం చేసి, పోలీస్‌ అధికారులపై దాడులకు తెగబడ్డారు. పోలీసుల వాహనాలకు నిప్పంటించారు. ఈ హింసాకాండలో సైనా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబోధ్‌ సింగ్‌ మరణించగా, నలుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top