వారిని చెట్టుకు కట్టేసి ఆపై..

BJP MLA Gyan Dev Ahuja Says Tie Cow Smugglers To A Tree And Inform Police - Sakshi

జైపూర్‌ : ఆవులను స్మగ్లింగ్‌ చేసే వారు పట్టుబడితే మూడు చెంపదెబ్బలు కొట్టి చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్‌ అహుజా అన్నారు. అల్వార్‌లో ఆవును తరలిస్తున్నారనే అనుమానంతో రక్బర్‌ ఖాన్‌ అనే వ్యక్తి మూక హత్యకు గురైన నేపథ్యంలో ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తాను ప్రజలను కోరుతున్నానన్నారు. గోవులను తరలించేవారని విపరీతంగా కొట్టే బదులు రెండు మూడు దెబ్బలు తగిలించాక వారిని పారిపోనీయకుండా చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.

పోలీసులు వచ్చిన అనంతరం వారిని అరెస్ట్‌ చేసి చట్టపరమైన చర్యలు చేపడతారని, ఏ ఒక్కరూ చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. కాగా రక్బర్‌ ఖాన్‌ హత్య కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన ముగ్గురు వ్యక్తులు అమాయకులని, వారిపై పోలీసులు అభియోగాలు మోపారని ఆయన ఆరోపంచారు. అరెస్ట్‌ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.ఘటనా స్థలానికి వారిని పిలిపించిన పోలీసులు రక్బర్‌ ఖాన్‌ హత్య కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన అవసరం ఉందని అంటూ వారిపై అభియోగాలు మోపారని అన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో వేధింపులు తాళలేక రక్బర్‌ ఖాన్‌ మరణించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top