బ్యాంకు సేవలకు అంతరాయం | Sakshi
Sakshi News home page

బ్యాంకు సేవలకు అంతరాయం

Published Wed, Dec 26 2018 11:00 AM

Bank Services To Be Affected Due To Strike - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ల విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇవ్వడంతో బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. వారం రోజుల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. ఈనెల 21 బ్యాంకు ఆఫీసర్ల యూనియన్‌ వేతన పరిష్కారం కోరుతూ విలీన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే సమ్మెకు సంబంధించి కస్టమర్లకు సమాచారం చేరవేశాయి. ఇక ప్రైవేట్‌ బ్యాంకులు యథాతథంగా పనిచేయనున్నాయి. ‍కాగా బ్యాంకు ఆఫీసర్లు, ఉద్యోగుల సంఘాలతో కూడిన యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ సమ్మెకు పిలుపు ఇచ్చింది. అదనపు చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌తో జరిపిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో తాజా సమ్మెకు పిలుపు ఇచ్చామని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ వెంకటాచలం వెల్లడించారు. ఈ భేటీలో విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లమని ప్రభుత్వం లేదా సంబంధిత బ్యాంకులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని చెప్పారు.

Advertisement
Advertisement