తిరువనంతపురం : ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్ర తన మొబైల్లో స్క్రీన్ సేవర్గా ఓ సాధారణ బాలిక ఫోటోను పెట్టుకున్నారు. అది కూడా ఆ బాలిక ఫోటో కోసం దాదాపు నాలుగు రోజులపాటూ ఎదురు చూసి చివరికి ఆ బాలిక ఫోటోను సాధించారు. పరీక్షకు ఆలస్యమవుతుండటంతో.. త్రిశూరు జిల్లాలో పదవ తరగతి పరీక్ష కేంద్రానికి క్రిష్ణ అనే బాలిక స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ వెళ్లడం చూపరులను ఆశ్చర్యపరిచింది. గుర్రపు స్వారీ చేస్తూ వేగంగా వెళ్తున్న బాలిక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
ఈ వీడియోను చూసిన ఆనంద్ మహింద్ర ట్విటర్ వేదికగా బాలికపై ప్రశంసల వర్షం కురిపించారు. 'త్రిశూర్లో ఆమె ఎవరికన్న తెలుసా? నాకు ఆమె ఫోటో కావాలి. నా మొబైల్ స్క్రీన్ సేవర్గా ఆమె గుర్రపు స్వారీ చేస్తున్న ఫోటోను పెట్టుకుంటా. ఆమె నా దృష్టిలో హీరో. ఆమెను చూస్తే బాలికల విద్య మరింత దూసుకెళుతుందన్న ఆశ కలుగుతోంది. బాలికల విద్య అద్భుతంగా ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమైన ఈ వీడియో వైరల్ కావల్సిన అవసరం ఉంది' అని ఏప్రిల్ 7న ట్వీట్ చేశారు.
అయితే శుక్రవారం ఆనంద్ మహీంద్ర కోరిక నెరవేరింది. ఆ బాలిక గుర్రపు స్వారీ చేస్తున్న ఓ ఫోటోను తన మొబైల్ స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నారు. 'త్రిశూరు జిల్లాలో స్కూలు బ్యాగును భుజాన వేసుకుని గుర్రపు స్వారీ చేసుకుంటూ పదవ తరగతి పరీక్ష కేంద్రానికి వెళ్లిన అందరికీ స్పూర్తినిచ్చే క్రిష్ణ అనే బాలిక గురించి నేనో వీడియోను ట్వీట్ చేశా. ఎవరికైనా ఆమె తెలిసుంటే నా మొబైల్ స్క్రీన్ సేవర్గా క్రిష్ణ ఫోటోను పెట్టుకుంటానని అడిగా. ఈ రోజే ఆ బాలిక ఫోటో మొయిల్లో వచ్చింది. పంపినందుకు సుబిన్కు కృతజ్ఞతలు' అని ఆనంద్ మహింద్ర ట్వీట్ చేశారు.
I had tweeted a video about Krishna, the inspiring young lady who rode her horse to her school exam in Thrissur. I asked if anyone knew her since I wanted a pic to use as a screensaver. I received this in my mail today. Many thanks Subin! pic.twitter.com/4BMu1JHxSL
— anand mahindra (@anandmahindra) April 11, 2019