
లోక్ సభలో తీవ్ర కలకలం
సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్ కాగితాలు చింపి స్పీకర్ సుమిత్రా మహాజన్ పై విసరడంతో కలకలం రేగింది.
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పాత పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. గురువారం పార్లమెంట్ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
లోక్ సభలో విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్ కాగితాలు చింపి స్పీకర్ సుమిత్రా మహాజన్ పై విసరడంతో కలకలం రేగింది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలతో సభ మార్మోగిపోయింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్ సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.
కాగా, స్పీకర్ పై కాగితాలు విసిరిన అక్షయ్ యాదవ్ పై కేంద్రం సీరియస్ గా ఉంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ సమావేశమయ్యారు. అటు రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. నోట్ల కష్టాలపై చర్చ ప్రారంభించారు.