akshay yadav
-
లోక్ సభలో తీవ్ర కలకలం
-
లోక్ సభలో తీవ్ర కలకలం
న్యూఢిల్లీ: నోట్ల కష్టాలతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. పాత పెద్ద నోట్లు రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగాయి. గురువారం పార్లమెంట్ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్ సభలో విపక్ష సభ్యులు తీవ్ర గందరగోళం సృష్టించారు. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అక్షయ్ యాదవ్ కాగితాలు చింపి స్పీకర్ సుమిత్రా మహాజన్ పై విసరడంతో కలకలం రేగింది. అధికార, విపక్ష సభ్యుల పరస్పర నినాదాలతో సభ మార్మోగిపోయింది. తిరిగి సమావేశమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో లోక్ సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. కాగా, స్పీకర్ పై కాగితాలు విసిరిన అక్షయ్ యాదవ్ పై కేంద్రం సీరియస్ గా ఉంది. ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తో కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ సమావేశమయ్యారు. అటు రాజ్యసభలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. నోట్ల కష్టాలపై చర్చ ప్రారంభించారు. -
'అఖిలేశ్ ను ఇంట్లోంచి గెంటేశారు'
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో ముసలం కొనసాగుతుండగానే బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ బాంబు పేల్చారు. సీఎం అఖిలేశ్ యాదవ్ కు మద్దతుగా ఆయన లేఖాస్త్రం సంధించారు. పార్టీలో సంక్షోభానికి ముమ్మాటికి శివపాల్ యాదవ్ కారణమని ఆరోపించారు. అఖిలేశ్ వ్యతిరేకంగా శివపాల్ ఏవిధంగా కుట్ర సాగించారో తన లేఖలో వివరించారు. 2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని, తానే సీఎం కావాలని శివపాల్ అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అఖిలేశ్ ను దారుణంగా అవమానించారని, మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్ ను ఇంట్లోంచి బలవంతంగా గెంటివేయడంతో, ఆయన కొత్త ఇంటికి మారారని వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఆయనను అణచివేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. అఖిలేశ్ కు తన తండ్రి మద్దతు ప్రకటించడం ఆయన జీర్ణించుకోలేకపోయారన్నారు. బీజేపీకి దగ్గరయ్యారంటూ తన తండ్రిపై అసత్య ప్రచారం చేశారని వాపోయారు. అయితే శివపాల్ సింగే బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. జూలైలో బీజేపీ ఎంపీతో కలిసి ఆ పార్టీకి చెందిన అగ్రనేతను శివపాల్ కలిశారని, తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. శివపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు అయిన ఖర్చు అమర్ సింగ్, బీజేపీ ఎంపీ భరించారని వెల్లడించారు. -
శివపాల్.. మా నాన్నను అవమానిస్తున్నారు!
ఉత్తరప్రదేశ్లోని అధికార సమాజ్వాదీ పార్టీలో మొదలైన చిచ్చు ఇప్పట్లో తగ్గేలా లేదు. పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన శివపాల్ యాదవ్ తమ కుటుంబంలో ఉన్న వ్యతిరేకులను టార్గెట్ చేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ కుమారుడు, అక్షయ్ యాదవ్ దీనిపై నోరు విప్పారు. శివపాల్ప తన తండ్రిని అవమానిస్తున్నారని మండిపడ్డారు. అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాంగోపాల్ యాదవ్ తమ్ముడి కొడుకైన అరవింద్ ప్రతాప్ యాదవ్ను, మరోవ్యక్తిని భూ ఆక్రమణల కేసులో ఆరోపణలున్నాయంటూ పార్టీ నుంచి తీసేశారు. దాంతో అక్షయ్ యాదవ్కు ఎక్కడలేని కోపం వచ్చింది. అరవింద్ యాదవ్ తమ కుటుంబ సభ్యుడని, అలాంటి వ్యక్తి నేతాజీ (ములాయం)కు వ్యతిరేకంగా మాట్లాడతాడని కలలో కూడా అనుకోలేమని అన్నారు. శివపాల్ ఇంటి వద్ద తన తండ్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు మద్దతుగా ఎవరున్నా వాళ్లందరినీ శివపాల్ యాదవ్ పార్టీ నుంచి తీసేస్తున్నారని ఆరోపించారు. దాంతో ములాయం కుటుంబంలో చిచ్చు మరోసారి బయటపడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ అఖిలేష్ యాదవ్కు సన్నిహితులైన ఏడుగురిపై కూడా శివపాల్ వేటు వేసిన విషయం తెలిసిందే.