
'అఖిలేశ్ ను ఇంట్లోంచి గెంటేశారు'
సమాజ్ వాదీలో ముసలం కొనసాగుతుండగానే బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ బాంబు పేల్చారు.
లక్నో: సమాజ్ వాదీ పార్టీలో ముసలం కొనసాగుతుండగానే బహిష్కృత నేత రాంగోపాల్ యాదవ్ కుమారుడు అక్షయ్ యాదవ్ బాంబు పేల్చారు. సీఎం అఖిలేశ్ యాదవ్ కు మద్దతుగా ఆయన లేఖాస్త్రం సంధించారు. పార్టీలో సంక్షోభానికి ముమ్మాటికి శివపాల్ యాదవ్ కారణమని ఆరోపించారు. అఖిలేశ్ వ్యతిరేకంగా శివపాల్ ఏవిధంగా కుట్ర సాగించారో తన లేఖలో వివరించారు.
2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని, తానే సీఎం కావాలని శివపాల్ అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అఖిలేశ్ ను దారుణంగా అవమానించారని, మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్ ను ఇంట్లోంచి బలవంతంగా గెంటివేయడంతో, ఆయన కొత్త ఇంటికి మారారని వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఆయనను అణచివేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.
అఖిలేశ్ కు తన తండ్రి మద్దతు ప్రకటించడం ఆయన జీర్ణించుకోలేకపోయారన్నారు. బీజేపీకి దగ్గరయ్యారంటూ తన తండ్రిపై అసత్య ప్రచారం చేశారని వాపోయారు. అయితే శివపాల్ సింగే బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. జూలైలో బీజేపీ ఎంపీతో కలిసి ఆ పార్టీకి చెందిన అగ్రనేతను శివపాల్ కలిశారని, తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. శివపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు అయిన ఖర్చు అమర్ సింగ్, బీజేపీ ఎంపీ భరించారని వెల్లడించారు.