
సైకిల్ టైర్లు మారుస్తున్న సీఎం: రాహుల్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. పాడైపోయిన సైకిల్కు టైర్లు మార్చేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఇప్పటికే దారుణంగా దెబ్బతిన్న తన ప్రభుత్వ ఇమేజిని కాపాడుకోడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగా ఆయన అలహాబాద్ సభలో మాట్లాడారు. అయితే, సైకిల్ రిపేరుకు ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని, నాలుగున్నరేళ్లు అనవసరంగా ఆయన వృథా చేశారని అన్నారు.
అఖిలేష్ పాలన దారుణంగా ఉందని చెబుతూ.. ఇక్కడ పాడైన విద్యుత్ వైర్లను ముట్టుకోడానికి కూడా ఎవరూ భయపడరని.. ఎందుకంటే, అసలు ఈ వైర్లలోంచి విద్యుత్ ప్రసరించదని ఎద్దేవా చేశారు. నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు రైతులు, నిరుద్యోగ యువత అవసరాలను పట్టించుకోకుండా బడా వ్యాపారవేత్తలకు కొమ్ము కాస్తోందన్నారు. పెద్ద వ్యాపారవేత్తలకు సంబంధంచిన రూ.1.1 లక్షల కోట్ల రుణాలను మోదీ ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సర్కారు రూ. 74వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందన్నారు.