బాలభారతాన్ని కబళిస్తున్న కేన్సర్‌

4 of 5 Indian children do not survive cancer - Sakshi

ప్రతి ఐదుగురు కేన్సర్‌ బాధిత చిన్నారుల్లో నలుగురు మృతి

నేడు కేన్సర్‌ అవగాహన దినం

భావిభారత విధాతలైన నేటి బాలలను కేన్సర్‌ మహమ్మారి కబళిస్తోంది. కేన్సర్‌ వ్యాధి సోకిన చిన్నారులను కాపాడుకోలేని పరిస్థితి ఆందోళన కరంగా తయారయ్యింది. కేన్సర్‌ వ్యాధిగ్రస్తులైన ప్రతి ఐదుగురు చిన్నారుల్లో నలుగురు మరణిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సరైన సమయంలో కేన్సర్‌ని గుర్తించకపోవడం, చికిత్సకోసం సుదూరప్రాంతాలకు వెళ్లాల్సి రావడం, వైద్యం ఖరీదవడం వల్ల కేన్సర్‌ వ్యాధిగ్రస్తులైన చిన్నపిల్లలు చికిత్సకు దూరమౌతున్నారు. ఉదాహరణకు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ముంబై టాటా మెమోరియల్‌ కేన్సర్‌ ఆసుపత్రిలో కేన్సర్‌ చికిత్సకోసం చేరుతోన్న చిన్నారుల్లో 43.6 శాతం మంది 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని తాజా రికార్డులు వెల్లడిస్తున్నాయి. పది శాతం మంది 2,200 కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఆసుపత్రిలో చేరుతున్నారు. మరో 20 శాతం మంది మాత్రం ఈ ఆసుపత్రిలో చేరడానికి ముందే అసంపూర్తిగా చికిత్స చేయించుకొని వస్తున్నారు.  

ఆ దేశాల్లో ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా తక్కువ ఆదాయం, మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లోని కేన్సర్‌ బాధిత చిన్నారుల్లో ఎక్కువ మంది చనిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది. దేశంలో కేన్సర్‌ సోకిన అత్యధిక మంది బాలలు ఐదేళ్ళకు మించి బతక్కపోవడానికి, కేన్సర్‌ని సరైన సమయంలో గుర్తించకపోవడం, వైద్యం ఖర్చు భరించలేనంతగా ఉండడం, సగంలోనే (అసంపూర్ణం) చికిత్సను ఆపివేయడం కారణాలని ఇండియా స్పెండ్‌ సంస్థ వెల్లడించింది.  

సరైన సమయంలో గుర్తిస్తే..
ప్రతియేటా దేశంలో దాదాపు 50,000 మంది 19 ఏళ్ళలోపు వయస్సువారు కేన్సర్‌‡ బారిన పడుతున్నట్టు ద లాన్‌సెంట్‌ అధ్యయనం గుర్తించింది. అయితే ఈ సంఖ్య వాస్తవంలో 75,000కు పైచిలుకే అంటున్నారు టీఎంహెచ్‌ ఆంకాలజిస్ట్‌ గిరీష్‌ చిన్నస్వామి. దాదాపు 20,000 మంది చిన్నారుల్లో కేన్సర్‌ని గుర్తించడం గానీ, దానికి చికిత్స చేయించడం గానీ జరగడంలేదు. కేన్సర్‌సోకిన 55,000 మందిలో కేవలం 15000 మందికే నైపుణ్యం, అనుభవం కలిగిన వైద్యుల ద్వారా నాణ్యమైన, మంచి చికిత్స లభిస్తోంది. అలాగే వారికి మంచి ఆహారం, వైద్యానికి ఆర్థిక సహకారం లభిస్తోంది. వీరిలో 70 శాతం మంది కేన్సర్‌ని జయిస్తున్నారు.

మూడోవంతు మంది మధ్యలోనే..
► కేన్సర్‌బారిన పడిన చిన్నారుల్లో 3వవంతు మంది అసంపూర్ణ చికిత్సకారణం గా బతికే అవకాశాన్ని కోల్పోతున్నారు.
► దిగువ, మధ్య తరగతి ఆదాయం కలిగిన దేశాల్లో 90 శాతం మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు.  
► మరింత పేదరికంలో మగ్గుతోన్న దేశాల్లో 99 శాతం మంది చికిత్స చేయించుకోకపోవడమో, లేక చికిత్సను మధ్యలోనే వదిలేయడమో జరుగుతోంది.

ఓ అధ్యయనం ప్రకారం
► ప్రత్యామ్నాయ, సాంప్రదాయ చికిత్సావిధానాన్ని అనుసరిస్తున్నవారు 31 శాతం
► ఆర్థిక పరిస్థితులు అనుకూలించక చికిత్సను మానుకుంటున్న వారు 28 శాతం
► కేన్సర్‌కి చికిత్సలేదనీ, అది నయం కాని వ్యాధి అని భావిస్తున్నవారు 26 శాతం

ఇండియా స్పెండ్‌ ప్రకారం
ప్రతి పదిలక్షల మంది జనాభాకి ఆంకాలజిస్ట్‌లు
► ఫిలిప్పైన్స్‌లో 25.63 మంది
► చైనాలో 15.39 ∙ఇరాన్‌లో 1.14
► భారత్‌లో 0.98

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top