వైఎస్‌గారికి మరణం లేదు | Vijay Chander appointed as Andhra Pradesh FDC chairman | Sakshi
Sakshi News home page

వైఎస్‌గారికి మరణం లేదు

Nov 21 2019 12:35 AM | Updated on Nov 21 2019 12:39 AM

Vijay Chander appointed as Andhra Pradesh FDC chairman - Sakshi

విజయచందర్‌

‘‘దివంగత నేత వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు నాకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ పదవి ఇస్తానన్నారు. ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిగారు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక నన్ను ఎఫ్‌డీసీ చైర్మన్‌గా నియమించి వైఎస్‌గారి మాట నిలబెట్టారు’’ అని నటుడు, ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా (ఏపీ ఎఫ్‌డీసీ) చైర్మన్‌గా ఇటీవల నియమితులైన విజయచందర్‌ అన్నారు. హైదరా బాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ....

► 2003లో ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు వైఎస్‌గారిని చూడగానే ‘సార్‌.. ఈ సారి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. నాకు ఎఫ్‌డీసీ చైర్మన్‌ అవ్వాలని ఉంది? అన్నాను. ఆయన నవ్వి సరే అన్నారు. 2004లో సీఎం అయ్యాక మొదటిసారి నాకు ఇవ్వలేదు. 2009లో 150 సీట్లతో మళ్లీ సీఎంగా గెలిచారు. ఆయన ఆఫీసుకు వెళ్తూ నన్ను చూసి, షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి, ‘ఎలా చెప్పావయ్యా 150 సీట్లు వస్తాయని?’ అన్నారు. ‘మూడు నెలల్లో నిన్ను ఎఫ్‌డీసీ చైర్మన్‌ చేస్తా’ అన్నారు. కుదర్లేదు. ఇప్పుడు ఆయన తనయుడు జగన్‌గారి ద్వారా నాకు ఇప్పించారనిపిస్తోంది.. అందుకే ఆయనకు మరణం లేదనే మాట నేడు నిరూపితమైంది. ఆయన ఆత్మ ఇక్కడే తిరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలనే ఆలోచనతో ఆయన ఉంటారు.

► ‘చెన్నైలో, హైదరాబాద్‌లో ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఎలా అభివృద్ధి చెందిందో అలా మన రాష్ట్రంలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ అభివృద్ధికి కృషి చేద్దాం’ అని జగన్‌గారు నాతో అన్నారు.

► తెలంగాణలో చిత్రరంగాన్ని అభివృద్ధి చేసినట్టు ఏపీలోనూ చేయాలని ఇండస్ట్రీ వారిని కోరుతున్నా. అందుకు కావాల్సిన అంశాలను  ఇండస్ట్రీ పెద్దలందర్నీ అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను.

► తెలుగు రాష్ట్రాల్లోని ఇండస్ట్రీ పెద్దలందర్నీ కలుసుకుంటాను. సురేష్‌ బాబుగారు ఫోన్‌ చేశారు. ఏపీలో షూటింగ్‌లకు డైరెక్ట్‌గా ఎఫ్‌డీసీ నుంచి అనుమతులు లభించేలా చూడాలన్నారు నిర్మాత వివేక్‌ కూచిభొట్ల. ఆంధ్రప్రదేశ్‌లో కొంత ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చి అక్కడ స్థిరపడిపోయే వారికి మరిన్ని సదుపాయాలు కల్పిస్తాం. ఆంధ్ర ప్రదేశ్‌లో కేవలం షూటింగ్‌లు మాత్రమే కాకుండా, నిర్మాణ సంస్థలు వారి ఆఫీసులను కూడా పెట్టాలని కోరుతున్నాం. ఏపీఎఫ్‌డీసీ డైరెక్టర్స్‌ విభాగంలో తొలి సభ్యుడిగా సుజిత్‌ను ఎంపిక చేసుకున్నాం.

► మన కళామతల్లికి సేవ చేస్తున్న వారందరి ఫొటోలు, వివరాలతో విశాఖపట్నంలో ‘నందనవనం’ పేరుతో మన చరిత్ర చూపించే విధంగా ప్లాన్‌ చేద్దాం’ అని జగన్‌గారు అన్నారు. అందుకు ఆయనకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కొత్త నిర్మాతలకు, చిన్న నిర్మాతలకు అండగా ఉంటాం.

► తెలుగు రాష్ట్రాల ఫిల్మ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుగార్లకు హ్యాట్సాఫ్‌.

Advertisement
 
Advertisement
Advertisement