జాతీయ గీతం పాడతారా? | Sakshi
Sakshi News home page

జాతీయ గీతం పాడతారా?

Published Tue, Feb 14 2017 10:56 PM

జాతీయ గీతం పాడతారా? - Sakshi

ఎటువంటి ఇమేజ్‌ చట్రంలోనూ చిక్కుకోని స్టార్‌ హీరోల్లో వెంకటేశ్‌ ఒకరు. పాత్రకు తగ్గట్టు పాదరసంలా మారుతుంటారు. ఇప్పుడీ పాదరసంను పవర్‌ఫుల్‌గా చూపించే ఆలోచనలో దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఉన్నారట. మహేశ్‌బాబు హీరోగా ‘జనగణమణ’ అనే దేశభక్తి చిత్రం తీయనున్నట్లు గతంలో పూరి ప్రకటించారు. కానీ, మహేశ్‌ ఏ మాటా చెప్పకపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ దేశభక్తి కథకు కొత్త హంగులు అద్ది వెంకీతో సినిమా తీయనున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.

పూరి సినిమాల్లో హీరోయిజం ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో.. పైపైకి వెళ్తుందో తెలిసిందే. ఈ ‘జనగణమణ’లోనూ వెంకీ క్యారెక్టర్, లుక్‌ అంతే స్థాయిలో పవర్‌ఫుల్‌గా ఉంటాయట. ప్రస్తుతం వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘గురు’ను మార్చి 31న విడుదల చేయాలనుకుంటున్నారట. ‘గురు’ తర్వాత కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లూ... మీకు జోహార్లు’ చేయాలనుకున్నారు వెంకీ. దాంతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారనీ వార్తలొచ్చాయి. మరి, ఆ రెండు చిత్రాల్లో ఏది ముందు పట్టాలు ఎక్కుతుంది? ఆ రెండూ కాకుండా పూరి ‘జనగణమణ’ సెట్స్‌కి వెళుతుందా? వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement