మైసూర్‌లో ముగ్గురు రాణులు 

Tamanna gets 3rd Director for  Queen remake - Sakshi

మైసూర్‌ వెళ్లారు మహాలక్ష్మి. అక్కడ ఏవో వర్క్స్‌ని కంప్లీట్‌ చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వస్తారు. ఎవరో మహాలక్ష్మి గురించి ఈ డీటైల్స్‌ ఎందుకు? అని తేలికగా తీసిపారేయకండి. ఎందుకంటే.. మైసూర్‌ వెళ్లింది మన టాలీవుడ్‌ మహాలక్ష్మినే. అదేనండీ.. తమన్నా అని చెప్తున్నాం. ఇంతకీ మహాలక్ష్మి మైసూర్‌ ప్రయాణం విశేషం ఏంటంటే... తమన్నా లీడ్‌ రోల్‌లో ‘అ!’ ఫేమ్‌ ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో ‘దటీజ్‌ మహాలక్ష్మి’ అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ హిట్‌ ‘క్వీన్‌’  చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. మనుకుమారన్‌ నిర్మిస్తున్నారు. అమిత్‌ త్రివేది స్వరకర్త. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతోంది. తమ్మూపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

టైటిల్‌ని బట్టి ఇప్పుడు మహాలక్ష్మి క్యారెక్టర్‌లో తమన్నా నటిస్తున్నారని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే... హిందీ చిత్రం ‘క్వీన్‌’ తమిళ, కన్నడ భాషల్లో కూడా రీమేక్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తమిళ రీమేక్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’లో కాజల్, కన్నడ రీమేక్‌ ‘బటర్‌ ఫ్లై’లో పరుల్‌ యాదవ్‌ నటిస్తున్నారు. కన్నడ, తమిళ వెర్షన్స్‌కు రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సెట్‌లో మంగళవారం పరుల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ జరిగాయి. తమన్నా, కాజల్‌ పాల్గొన్నారు. ‘‘ఇది నాకు స్పెషల్‌ పుట్టినరోజు. ఈ చిత్రానికి పని చేయడం మర్చిపోలేని అనుభూతి’’ అన్నారు పరుల్‌. ఇలా మైసూర్‌లో ముగ్గురు రాణులు కలుసుకున్నారన్నమాట. మలయాళం ‘క్వీన్‌’ రీమేక్‌లో నటిస్తోన్న మంజిమా మోహన్‌ మాత్రం ఈ వేడుకల్లో పాల్గొనలేదు. సోషల్‌ మీడియా ద్వారా పరుల్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపారామె. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top