సుశాంత్‌కు గొప్ప నివాళి | Sakshi
Sakshi News home page

సుశాంత్‌కు గొప్ప నివాళి

Published Mon, Jun 22 2020 1:07 AM

Sushant Singh biopic directed by Nikhil Anand - Sakshi

బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్‌ జీవితం ఆధారంగా నిఖిల్‌ ఆనంద్‌ ఓ సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. క్రౌడ్‌ ఫండింగ్‌ విధానంలో ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఈ సినిమా గురించి నిఖిల్‌ ఆనంద్‌ మాట్లాడుతూ – ‘‘సుశాంత్‌ మన మధ్య లేరనే నిజాన్ని ఒప్పుకోవడం చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా రాణించాలనుకునే ప్రతి సాధారణ వ్యక్తికి సుశాంత్‌ ఓ స్ఫూర్తి. సుశాంత్‌ కేవలం మంచి నటుడు మాత్రమే కాదు.. మంచి మానవతావాది కూడా. నేను తీయబోయే సుశాంత్‌ బయోపిక్‌ అతనికి ఓ గొప్ప నివాళి.

యాక్టర్స్‌గా కెరీర్‌ను ప్రారంభించాలనుకునే చాలామంది యువతీయువకులకు ఈ బయోపిక్‌ ఓ ప్రేరణలా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా ద్వారా ప్రతిభావంతులైన అవుటర్స్‌కు మంచి అవకాశాలు వచ్చేలా బాలీవుడ్‌లో మార్పు రావాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు నిఖిల్‌. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ సినిమాను 2022లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. సుశాంత్‌ జీవితం ఆధారంగా ‘సూసైడ్‌ ఆర్‌ మర్డర్‌?: ఏ స్టార్‌ వాజ్‌ లాస్ట్‌’ అనే చిత్రం కూడా బాలీవుడ్‌లో రూపొందనుంది. షామిక్‌ మౌలిక్‌  దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను విజయ్‌ శేఖర్‌ గుప్తా నిర్మించనున్నారు.

Advertisement
Advertisement