నేను అలా చేయను!

Shraddha Srinath Avoids Stories Listening in Night - Sakshi

తమిళసినిమా: సాధారణంగా అయితే నేనలా చేయను అంటోంది నటి శ్రద్ధా శ్రీనాథ్‌. పుట్టింది జమ్ముకశ్మీర్‌లో అయినా నటిగా మలయాళం, కన్నడం, తమిళం అంటూ చుట్టేస్తోందీ బ్యూటీ. కోహినూర్‌ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన శ్రద్ధాశ్రీనాథ్‌కు కన్నడ చిత్రం యూటర్న్‌ బిగ్‌ టర్నింగ్‌నిచ్చింది. ఆ తరువాత తమిళంలో మాధవన్‌తో రొమాన్స్‌ చేసిన విక్రమ్‌ వేదా ఇంకాస్త గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతే అక్కడ నుంచి ఈ అమ్మడికి అవకాశాలు వరుస కట్టేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో కాట్రు వెలియిడై చిత్రంలోనూ అతిథి పాత్రలో మెరిసిన శ్రద్ధాశ్రీనాథ్‌కు తాజాగా అరుళ్‌నిధితో రొమాన్స్‌ చేసే అవకాశం వరించింది. భరత్‌ నీలకంఠన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్నకు ఈ జాణ బదులిస్తూ ఎస్‌సీ.సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తనను ఎంపిక చేయాలన్న ఆలోచన చిత్ర దర్శక నిర్మాతలకు లేదంది. అనూహ్యంగానే అది జరిగిందని చెప్పింది.

దర్శకుడు భరత్‌ నీలకంఠన్‌ కథా చర్చలకు బెంగళూర్‌ వచ్చారని చెప్పింది. అనుకోకుండా ఒక రోజు దర్శకుడి నుంచి తనకు ఫోన్‌ వచ్చిందని తెలిపింది. సాధారణంగా తాను రాత్రి వేళల్లో కథలను విననంది. అయితే దర్శకుడు బెంగళూర్‌ వచ్చిన కారణంగా ఒక రోజు రాత్రి ఆయన్ని కలిసి కథ విన్నానని చెప్పింది. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకూ దర్శకుడు కథను వినిపించారని ఆమె ఈ సందర్భంగా తెలిపిం ది. కథలోని ప్రతి సన్నివేశాన్ని ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేకుండా చెప్పడంతో అప్పుడే నాకు ఆ చిత్రంలో నటించాలన్న ఆసక్తి కలిగిం దని ఆమె అంది. దీన్ని థ్రిల్లర్‌ కథా చిత్రం అని చెప్పలేమని, ఇంటెలిజెన్సీ నేపథ్యంలో సాగే వైవిధ్యభరిత డ్రామాతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని ఆమె పేర్కొంది.

ఈ చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శకుడు భరత్‌ నీలకంఠన్‌ ఈ సందర్భంగా  మీడియాకు వెల్లడించారు. అరుళ్‌నిధి, శ్రద్ధాశ్రీనాథ్‌ వంటి పాపులర్‌ జంటతో ఈ చిత్రం చేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top