సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను | Parthiban New Movie Oththa Seruppu Size 7 Censor Completed | Sakshi
Sakshi News home page

సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకోను

Jun 26 2019 10:20 AM | Updated on Jun 26 2019 10:20 AM

Parthiban New Movie Oththa Seruppu Size 7 Censor Completed - Sakshi

తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను తయారు చేసుకోనని అన్నారు నటుడు, దర్శకుడు ఆర్‌.పార్తీపన్‌.  జయాపజయాలను పక్కన పెడితే పార్తీపన్‌ చిత్రాలకంటూ ప్రేక్షకులు ప్రత్యేకంగా ఉంటారు. ఈయన చిత్రాలు ప్రయోగాత్మకంగానూ, ప్రయోజనాత్మకంగానూ ఉంటాయని చెప్పవచ్చు. అలా చిన్న గ్యాప్‌ తరువాత పార్తీపన్‌ చేసిన మరో ప్రయోగం ఒత్త చెరుప్పు సైజ్‌ 7.

సినిమా పేరే వైవిధ్యంగా ఉంది కదూ. కథా, కథనాలు కొత్తగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రం అంతా ఒక్క పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అవును ఆ పాత్రని పోషించింది పార్తీపనే. ఒకే పాత్రతో ఇంతకుముందు కొన్ని చిత్రాలు వచ్చినా, పార్తీపన్‌ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ ఒత్త చెరుప్పు సైజ్‌ 7 వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటుందంటున్నారీయన. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని, రసూల్‌ పోకుట్టి సౌండ్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకోవంతో పాటు సెన్సార్‌ను జరుపుకుంది.

చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ చిత్ర సృష్టికర్త పార్తీపన్‌ మాట్లాడుతూ తాను సెన్సార్‌ను దృష్టిలో పెట్టుకుని కథలను రాసుకోనని అన్నారు. అలా చేస్తే కథ బలాన్ని కోల్పోతుందన్నది తన అభిప్రాయం అన్నారు. ఒత్త చెరుప్పు సైజ్‌ 7 చిత్రానికి యూ  సర్టిఫికెట్‌ ఇవ్వడం సంతోషం అన్నారు. అయితే తన దృష్టిలో చిత్రానికి రెండు సెన్సార్‌ సర్టిఫికెట్లు ఉంటాయని అన్నారు. అందులో ఒకటి సెన్సార్‌ సభ్యులిచ్చిన సర్టిఫికేట్‌ అయితే రెండోది ప్రేక్షకులు ఇచ్చే సర్టిఫికెట్‌ అని అన్నారు.

ఆ రెండో సిర్టిఫికేట్‌ కోసమే తానిప్పుడు ఎదురు చూస్తున్నానని అన్నారు. ఇది ఒక్క పాత్రతో రూపొందిన చిత్రం అయినా, హీరోలు మాత్రం చాలా మంది ఉన్నారని అన్నారు.ఈ చిత్రానికి పనిచేసిన సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్, సౌండ్‌ ఇంజినీర్‌ రసూల్‌ పోకుట్టి ఇలా చాలా మంది హీరోలేనని పార్తీపన్‌ పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదీని వెల్లడిస్తానని పార్తీపన్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement