టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఆవేదన
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యోదంతం దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరూ ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. మానవ మృగాల చేతిలో అత్యంత దారుణ హత్యకు గురైన ప్రియాంకా రెడ్డి ఘటనపై టాలీవుడ్ హీరో మహేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. తరాలు మారుతున్నా మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నాం అంటూ ట్విటర్లో భావోద్వేగ పోస్ట్ చేశారు.
‘రోజులు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ పరిస్థితులు మాత్రం మారడం లేదు. ఓ సమాజంగా మనం ఓడిపోయాం. ఇలాంటి దారుణ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలి. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. బాధిత మహిళలకు న్యాయం కోసం పోరాడుదాం. భారతదేశాన్ని ఆడవారికి సురక్షితంగా మార్చుదాం’ అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక మహేశ్ బాబు వాయిస్ ఓవర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. స్త్రీకి బాసటగా నిలుస్తోన్న ఆ క్లిప్పింగ్లో మహేశ్ బాబు మాటలివి..
ఎవరి కళ్లలో సంస్కారం సూర్యకాంతిలా మెరుస్తుందో..
ఎవరి మాట మన్ననగా ఉంటుందో..
ఎవరి మనసు మెత్తగా ఉంటుందో..
ఎవరి ప్రవర్తన మర్యాదగా ఉంటుందో..
ఎవరికి ఆడవాళ్లంటే హృదయంలో అభిమానం.. సమాజంలో గౌరవం ఉంటాయో..
ఎవరు వాళ్ల శరీరానికి, మనసుకు, ఆత్మకు విలువిస్తారో..
వారి ఆత్మగౌరవానికి తోడుగా నిలుస్తారో..
ఎవరు మగువ కూడా మనిషే అని ఒక్క క్షణం మరిచిపోరో..
స్త్రీకి శక్తి ఉంది.. గుర్తింపు ఉంటుంది.. గౌరవం ఉండాలని ఎవరు మనస్ఫూర్తి అనుకుంటారో..
ఎవరికి దగ్గరగా ఉంటే.. వాళ్లకి ప్రమాదం దూరంగా పారిపోతుందని నమ్మకం ఉంటుందో..
అలాంటి వాడు స్త్రీకి నిజమైన స్నేహితుడు, సహచరుడు, ఆత్మీయుడు..
ఒక్కమాటలో చెప్పాలంటే.. వాడే మగాడు..
చదవండి