హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

KGF 2 Shooting Start In Hyderabad and Bangalore - Sakshi

సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఓ రేంజ్‌లో పాపులర్‌ అయిన చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమాతో కన్నడ స్టార్‌ యశ్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, శరణ్‌ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌  ప్రతినాయకుని పాత్ర ‘అధీరా’ గా కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో హీరో యశ్‌ మాట్లాడుతూ.. ఫిల్మ్‌ మేకర్స్‌ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ఉత్తమంగా రూపోందించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. సినిమాలో ఆధీరా పాత్ర చాలా శక్తివంతంగా ఉండబోతుందని తెలిపారు.

ఇటీవలే  కేజీఎఫ్‌-2 చిత్రీకరణ​కు షాక్‌ తాకిన విషయం తెలిసిందే. కోలార్‌ గోల్డ్‌ మైన్స్‌లో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు షూటింగ్‌ వల్ల పర్యావరణానికి హానీ కలుగుతుందని  స్థానిక వ్యక్తి కేసు ఫైల్‌ చేశాడు. అనంతరం అతని వాదనలు విన్న కోర్టు షూటింగ్‌ వెంటనే ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ సినిమాకు కొంత గ్యాప్‌ ఏర్పడింది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని ఆలోచించిన చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌, బెంగుళూరుకు మకాం మార్చారు. దీంతో కొన్ని రోజుల స్వల్ప విరామం తర్వాత కేజీఎఫ్‌- 2 మళ్లీ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. హైదరాబాద్‌, బెంగుళూర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ సెట్లతో ఈ షూటింగ్‌ నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top