పాకిస్థాన్‌లో పోటిచేసినా సిద్దూ గెలుస్తాడు! | Siddu May Win From Pakistan Also! | Sakshi
Sakshi News home page

పాకిస్థాన్‌లో పోటిచేసినా సిద్దూ గెలుస్తాడు!

Nov 28 2018 6:26 PM | Updated on Nov 28 2018 6:26 PM

Siddu May Win From Pakistan Also! - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తన స్నేహితుడైన ఒకప్పటి క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోతి సింగ్‌ సిద్దూకు  బాసటగా నిలిచారు. పాక్‌ ప్రధానిగా తన ప్రమాణస్వీకారానికి హాజరైనందుకు సిద్ధూ భారత్‌లో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఇమ్రాన్‌ మాట్లాడారు. ‘ సిద్దూను ఎందుకు విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నా ప్రమాణస్వీకారానికి వచ్చి అతను శాంతిని, స్నేహభావాన్ని పెంచాడు. అతను ఇక్కడి పంజాబ్‌లో పోటి చేసినా గెలిచి తీరుతాడు’ అని ఇమ్రాన్‌ పేర్కొన్నారు. కర్తాపూర్‌ కారిడార్‌ శంకుస్థాపన వేడుకలో భాగంగా ఇమ్రాన్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి భారత్‌ తరఫున సిద్దూ హాజరైన విషయం తెలిసిందే. 

సిక్కులు పవిత్రంగా భావించే పాకిస్థాన్‌లోని గురుద్వార దర్బార్‌, కర్తాపూర్‌ నుంచి భారత్‌ గురుదాస్‌పూర్‌లోని డేరాబాబా నానక్‌ పుణ్యక్షేత్రం వరకు ప్రత్యేక రహదారి కారిడార్‌ను ఏర్పాటు చేయడానికి పాకిస్థాన్‌ ప్రభుత్వం బుధవారం శంకుస్థాపన చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దూ.. 70 ఏళ్ల సిక్కుల నిరీక్షణకు పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తెరదించారని ప్రశంసల జల్లు కురిపించారు. పాక్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణస్వీకారానికి హాజరై.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ ఆలింగనం చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement