అత్యవసర పరిస్థితిని ఎత్తేశారు
మాలే, మాల్దీవులు : ఆసియా ఖండంలో అతి చిన్న దేశం మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితిని ఎత్తేస్తున్నట్లు దేశాధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ ప్రకటించారు. రాజకీయ సంక్షోభం తలెత్తడంతో గత 45 రోజులుగా మాల్దీవుల్లో ఎమర్జెన్సీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భద్రతా బలగాల సూచనల మేరకు ఎమర్జెన్సీని తొలగించినట్లు యమీన్ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఎంపీలను తిరిగి పదవుల్లోకి తీసుకోవాలని దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అధ్యక్షుడు యమీన్ తీవ్రంగా వ్యతిరేకించారు. అత్యున్నత న్యాయస్థాన తీర్పును అమలు చేసేందుకు నిరాకరించారు. ఈ క్రమంలోనే యమీన్ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు.
ఎమర్జెన్సీ సమయంలో మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్ను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్, మరో న్యాయమూర్తి అలీ హమీద్తో పాటు నలుగురు శాసనకర్తలను అరెస్ట్ చేశారు.