భారత్-పాక్ అణుయుద్ధంపై బ్రిటన్ భయం | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ అణుయుద్ధంపై బ్రిటన్ భయం

Published Thu, Jul 7 2016 3:53 AM

Fear to Britain on India - Pak nuclear warfare

- 2001 నాటి ఘటన తాజాగా వెల్లడి
తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్‌పై యుద్ధం
 
 లండన్ : 2001లో భారత పార్లమెంటుపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు భారత్-పాకిస్తాన్‌ల మధ్య అణు యుద్ధం జరుగుతుందేమోనని బ్రిటన్ భయపడినట్లు తాజా నివేదిక ద్వారా తెలిసింది. అప్పుడ ఇరుదేశాలను బుజ్జగించి సైనిక చర్యను ఆపడానికి బ్రిటన్ యత్నించింది. 2003లో ఇరాక్ దాడిపై నియమించిన విచారణ కమిటీ నివేదిక బుధవారం బహిర్గతమైంది. మాజీ ఉన్నతాధికారి జాన్ చిల్కాట్ నేతృత్వంలోని ఈ కమిటీ నివేదిక 12 సంపుటాలతో వెలువడింది.

అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి జాక్ స్ట్రా ఈ కమిటీ ముందు హాజరై భారత్-పాక్ అణు యుద్ధం గురించి చెప్పారు. దీని గురించి నాటి అమెరికా విదేశాంగ మంత్రి పావెల్‌తో సమాచారం పంచుకున్నట్లు తెలిపారు. అమెరికాలో 9/11 ఉగ్రదాడి తర్వాత బ్రిటన్ దృష్టి అఫ్గానిస్తాన్‌పై ఉండిందని, అయితే దాని తర్వాత 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై ఉగ్రవాదాడి తర్వాత బ్రిటన్, అమెరికాలు భారత్-పాక్‌లపై దృష్టి పెట్టాయన్నారు. నాటి బ్రిటన్ ప్రధాని బ్లెయిర్ తప్పుడు నిఘా సమాచారంతోనే ఇరాక్ నియంత సద్దాంను తప్పించేందుకు అక్రమ యుద్ధానికి దిగినట్లు స్ట్రా చెప్పారు. నిరాయుధీకరణ అవకాశమున్నా బ్రిటన్ ఎలాంటి శాంతి చర్యలకు పూనుకోలేదని చెప్పారు. ఇరాక్‌పై అమెరికాతో కలసి యుద్ధం చేసిన ఆ సమయంలో సైనిక చర్య చివరి ప్రయ్నతం కాదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement