కేర్‌ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!

Coronavirus New Outbreak in London Care Centres - Sakshi

లండన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న వృద్ధుల సంఖ్య లండన్‌లోని కేర్‌ సెంటర్లలో రోజు రోజుకు పెరిగిపోతోంది. లండన్‌లో ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5,890కు చేరుకుంది. కేర్‌ సెంటర్లలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యను ఎందుకో ఇందులో కలపలేదు. ఐదేళ్ల క్రితంతో పోలిస్తే కేర్‌ సెంటర్లలో మరణాల సంఖ్య నాలుగింతలు పెరిగిందని, కరోనా కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని సామాజిక కార్యకర్త కేట్‌ టెర్రాని తెలిపారు.

కేర్‌ సెంటర్ల నుంచి కరోనా వైరస్‌ లక్షణాలను కలిగిన వృద్ధులను జనరల్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నంటే వారికి కరోనా సోకిందని గుర్తించి కూడా ఆస్పత్రి ఏమీ లేదంటూ వెనక్కి పంపిస్తున్నారని, దాని వల్ల కేర్‌ సెంటర్లలో కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోందని కేట్‌ ఆరోపించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని ‘కేర్‌ క్వాలిటీ కమిషన్‌’ తెలియజేసింది. వృద్ధులన్న కారణంగానే కేర్‌ సెంటర్ల నుంచి వచ్చిన వారికి  కరోనా సోకిందని గుర్తించినప్పటికీ వెనక్కి పంపిస్తున్నారని, ఇది చట్టవిరుద్ధమని, దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని కమిషన్‌ స్పష్టం చేసింది. బ్రిటన్‌లో కరోనా వైరస్‌ కేసులు రెండు లక్షలు దాటిపోగా, మృతుల సంఖ్య 31 వేలు దాటేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top