సరిహద్దుల్లో బంగారు గనులు
అరుణాచల్ సమీపంలో తవ్వకాలు ప్రారంభించిన చైనా
ఆక్రమించేందుకేనంటూ ఓ పత్రిక కథనం
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో, చైనా అధీనంలో ఉన్న ప్రాంతంలో భారీగా బంగారం, వెండి, ఇతర విలువైన ఖనిజాల గనులు ఉన్నట్లు హాంకాంగ్కు చెందిన ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ ఖనిజాల విలువ మొత్తంగా 60 బిలియన్ అమెరికన్ డాలర్లు (దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలు) ఉంటుందనీ, చైనా ఇప్పటికే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని తెలిపింది. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో గనుల తవ్వకాలు జరుగుతున్నాయనీ, ఇటీవల తవ్వకాలను చైనా భారీగా పెంచిందని పోస్ట్ తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దును పంచుకుంటున్న ళుంజె కౌంటీలో ఈ గనులు ఉన్నట్లు పోస్ట్ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ తమదేననీ, దక్షిణ టిబెట్లో ఆ రాష్ట్రం భాగమని చైనా ఇప్పటికే వాదిస్తుండటం తెలిసిందే. ఈ ఈశాన్య రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు చైనా చూస్తోందనీ, ఆ ప్రయత్నంలో భాగంగానే ఖనిజాల తవ్వకాన్ని భారీ ఎత్తున ప్రారంభించిందని పత్రిక తన కథనంలో పేర్కొంది. దక్షిణ టిబెట్ను మళ్లీ చేజిక్కించుకునేందుకు చైనా వేసిన బృహత్తర ప్రణాళికలో భాగమే ఈ గనుల తవ్వకాలని కొందరు అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.
మరిన్ని వార్తలు