ఆ వార్తలు అవాస్తవం: భూటాన్‌ | Bhutan Denies Reports Of Stopping Water Supply To Assam | Sakshi
Sakshi News home page

భూటాన్‌-అస్సాం నీటి వివాదం అవాస్తం: భారత్‌

Jun 26 2020 3:19 PM | Updated on Jun 26 2020 3:55 PM

Bhutan Denies Reports Of Stopping Water Supply To Assam - Sakshi

గువాహాటి: అస్సాంకు, భూటాన్‌ నుంచి వచ్చే నీటి సరఫరా సహజంగానే ఆగిపోయిందని, ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదని భారత ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అస్సాంకు వచ్చే నీటిని భూటాన్ నిలిపివేయడంతో పాకిస్తాన్‌, చైనా, నేపాల్‌ మాదిరిగా ఇప్పుడు భూటాన్‌ కూడా సరిహద్దుల్లో భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తుందంటూ గురువారం మీడియాల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలను భూటాన్‌ ఖండిస్తూ ‘నీటి పారుదల సహజంగానే ఆగిపోయింది. అంతే కానీ మేము నీటిని నిలిపివేయలేదు. అస్సాంకు సరఫరా అయ్యే నీటిలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని మరమ్మత్తులు కూడా  చేయిస్తున్నాం’ అని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వం వెల్లడిస్తూ.. భూటాన్‌, అస్సాం నీటి సరిహద్దు వివాదామంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని ప్రకటించింది. (ఈ 10 దేశాలు, నగరాలు తప్పక చూడాల్సిందే!)

దీనిపై భూటాన్ అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ... ‘‘మేము అస్సాంలోని ప్రాంతాలకు నీటిపారుదల సరఫరాను నిలిపివేశామని ఆరోపించి ప్రచరించిన మీడియా నివేదికలు అవాస్తవం. ఇది నిజంగా బాధ కలిగించే విషయం. స్నేహపూర్వక ప్రజలు(భూటాన్‌-అస్సాం) మధ్య వివాదం సృష్టించేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారు. ఇది స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలు’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల వ్యవసాయం కోసం భూటాన్‌లో నిర్మించిన ఈ డాంగ్‌ ఛానెల్‌ నీటిని 1953 నుంచి అస్సాం, భూటాన్‌ రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నారు. అస్సాం వరిసాగుకు ఈ నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. దీంతో భూటాన్‌ నీటి సరఫరాను నిలిపివేసినట్లు వార్తలు రావడంతో సరిహద్దుల్లో అస్సాం రైతులంతా ధర్నా చేసినట్లు గువాహటి ప్రజలు పేర్కొన్నారు.   


 

Advertisement
 
Advertisement
Advertisement