ఈ దశాబ్దం చాలా హాట్‌ గురూ.! 

2019 in the top three in high temperatures - Sakshi

అధిక ఉష్ణోగ్రతల్లో తొలి మూడు స్థానాల్లో 2019

మాడ్రిడ్‌: చరిత్రలో అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ప్రస్తుత దశాబ్దం(2010–2019)లోనే నమోదైనట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి వార్షిక సమావేశంలో వాతావరణ మార్పులు మానవాళి సామర్థ్యాన్ని ఏవిధంగా అధిగమిస్తున్నాయో తెలిపింది. అలాగే పారిశ్రామికీకరణ ముందు సమయం (1850–1900) లోని సగటు ఉష్ణోగ్రత కంటే ఈ ఏడాదిలో ఇప్పటివరకు ప్రపంచ ఉష్ణోగ్రతల్లో సుమారు 1.1 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరుగుదల నమోదైనట్లు ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎమ్‌వో) వెల్లడించింది. దీంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరాల్లో 2019 మొదటి 3 స్థానాల్లో నిలిచిందని పేర్కొంది.  

మానవ కారణ ఉద్గారాలు, మౌలిక వసతుల నిర్మాణం, పంట సాగు, వస్తు రవాణా వంటివి 2019ని అత్యంత కార్బన్‌ ఉద్గారాలు వెలువడిన ఏడాదిగా రికార్డుకు ఎక్కించిందని డబ్ల్యూఎమ్‌వో వెల్లడించింది. గ్రీన్‌ హౌస్‌ వాయువుల కారణంగా ప్రపంచంలో వెలువడిన ఉష్ణోగ్రతల్లో 90 శాతానికిపైగా వేడిని సముద్రాలు గ్రహిస్తాయని, దీంతో అవి ప్రస్తుతం అత్యంత వేడిని నమోదు చేస్తున్నాయని తెలిపింది.  గత 12 నెలల్లో గ్రీన్‌ల్యాండ్‌ మంచు పలకల్లో సుమారు 329 బిలియన్‌ టన్నుల మంచు కరిగిపోయిందని డబ్ల్యూఎమ్‌వో వివరించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top