ఈ నెల 31వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు
హాజరుకానున్న 1.25 లక్షల మంది అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 31వ తేదీన ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పీడీ), లాంగ్వేజ్ (ఇంగ్లిష్) పోస్టులకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. టీజీటీ, పీజీటీ రెండింటికి 40 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వేర్వేరుగా కాకుండా ఒకటే హాల్టికెట్ జారీ చేస్తామని వెల్లడించింది. ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు నిర్వహిస్తున్నామని, మెయిన్ పరీక్ష 300 మార్కులకు నిర్వహించనున్నట్లు పేర్కొంది.
ఈ పరీక్షలకు 1.25 లక్షల మంది హాజరుకానున్నట్లు తెలిపింది. ఇక పీజీటీ, టీజీటీ తెలుగు, ఉర్దూ, హిందీ, సంస్కృతం పోస్టులకు వచ్చే నెల 14న స్క్రీనింగ్ టెస్టు నిర్వహించనున్నట్లు వివరించింది. త్వరలోనే హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 040–23120301, 040–23120302 నంబర్లలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చని వెల్లడించింది.