స్విస్ చాలెంజ్ కేసు నేటికి వాయిదా | Swiss Challenge case Postponed to Today | Sakshi
Sakshi News home page

స్విస్ చాలెంజ్ కేసు నేటికి వాయిదా

Sep 28 2016 1:42 AM | Updated on Sep 4 2017 3:14 PM

రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రధాన ప్రతిపాదకుడి (ఓపీపీ)గా ఉన్న సింగపూర్ కన్సార్టియంకు అంతర్జాతీయంగా...

సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రధాన ప్రతిపాదకుడి (ఓపీపీ)గా ఉన్న సింగపూర్ కన్సార్టియంకు అంతర్జాతీయంగా పలు రంగాల్లో విశేష అనుభవం ఉందని, పోటీ ప్రతిపాదనలు సమర్పించే కంపెనీలు సైతం అదే స్థాయిలో ఉండాలన్న ఉద్దేశంతోనే అందుకు అనుగుణంగా టెండర్ నిబంధనలను రూపొం దించామని అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. మార్కెటింగ్‌లో విశేష అనుభవానికి పెద్ద పీట వేసేందుకే ‘భారతదేశం వెలుపల అనుభవం’ అన్న నిబంధన పెట్టామన్నారు.

స్విస్ చాలెంజ్ పద్ధతిలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీ ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ, బిడ్‌ల సమర్పణ గడువు తేదీలను పొడిగిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్, సవరణ నోటిఫికేషన్‌లపై స్టే విధిస్తూ సింగిల్ జడ్జి ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏలు అప్పీల్ దాఖలు చేశాయి. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ తన వాదనలను కొనసాగించారు. కోర్టు పనివేళలు ముగియడంతో తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.

Advertisement
 
Advertisement
Advertisement