మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్‌’ | school girls missing in hyderabad | Sakshi
Sakshi News home page

మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్‌’

Jun 14 2017 7:07 AM | Updated on Sep 4 2018 5:24 PM

మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్‌’ - Sakshi

మిస్టరీగా బాలికల ‘మిస్సింగ్‌’

మైనర్‌ బాలికల వరుస మిస్సింగ్‌ కేసులు బాచుపల్లి పోలీసులకు సవాలుగా మారాయి.

హైదరాబాద్ (జగద్గిరిగుట్ట): మైనర్‌ బాలికల వరుస మిస్సింగ్‌ కేసులు బాచుపల్లి పోలీసులకు సవాలుగా మారాయి. ఓ కేసు దర్యాప్తులో మునిగి ఉండగానే మరో మిస్సింగ్‌ కేసు నమోదవుతోంది. ఈ నెల 7న నిజాంపేటకు చెందిన పదవ తరగతి విద్యార్థిని పూర్ణిమ సాయి పాఠశాలకు వెళ్లింది. అప్పటినుంచీ ఆచూకీ లభించలేదు కదా కనీసం చిన్న క్లూ కూడా దొరకక పోవడం పోలీస్‌ వర్గాలతో పాటు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. పోలీసులు 14 బృందాలుగా ఏర్పడి ఇటు సైబరాబాద్‌.. అటు రాచకొండ కమిషనరేట్‌ల పరి«ధిలో విస్తృతంగా గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలోని సీసీ ఫూటేజీలకు పరిశీలిస్తున్నారు.

ఈ విషయంపై ఇటీవల సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ జానకి షర్మిల నిజాంపేటలోని పూర్ణిమ సాయి ఇంటికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. వైజాగ్, యానం ప్రాంతాలకు పూర్ణిమ వెళ్లి ఉండవచ్చనే అనుమానం కుటుంబ సభ్యులు వ్యక్తం చేసిన నేపధ్యంలో ఆ కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో ఘటనలో నిజాంపేట కేటీఆర్‌ కాలనీకి చెందిన ప్రసాద్‌ కుమార్తె దుర్గాదేవి (14) ఈ నెల 11న కిరాణా దుకాణానికి వెళ్లి అదృశ్యమైంది. ఇప్పటి వరకు ఆ బాలిక కూడా తిరిగి రాలేదు. ఇంకా నిజాంపేటలోని బండారు లేఅవుట్‌లో నివాసముండే శ్యాంసుందర్‌రెడ్డి కుమార్తె యామిని(16) ఈ నెల 11న బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైంది. యామిని ఖమ్మంలోని తన స్వగ్రామం వెళ్లినట్లు తెలిసింది. పూర్ణిమ, దుర్గాదేవిల మిస్సింగ్‌లు మిస్టరీగానే మారాయి. 

Advertisement
 
Advertisement
Advertisement