
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఆన్లైన్ ప్రవేశాలకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 10 నుంచి విద్యార్థు లు ఆన్లైన్లో (ఛీౌట్ట.ఛిజజ.జౌఠి.జీn) రిజిస్ట్రేషన్ చేసుకునేలా, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేలా చర్యలు చేపట్టింది. ప్రవేశాల నోటిఫికేషన్, షెడ్యూలు వివరాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొ. లింబాద్రి మంగళవారం వెల్లడించారు. డిగ్రీ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే విద్యార్థులు మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు.
ప్రవేశాలు, సీట్ల కేటాయింపు వివరాలను మొబైల్కే పంపిస్తామన్నారు. విద్యార్థులు తమ ఆధార్ నంబర్ ఇవ్వాలని, మొబైల్ నంబరు ఆధార్తో లింక్ అయ్యుంటే ఏదైనా నెట్ సెంటర్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. ఆధార్తో అనుసంధానం చేసుకోని వారు మీసేవ/హెల్ప్లైన్ కేంద్రాల్లో అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. అక్కడా అథెంటికేషన్ కాకపోతే ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామ న్నారు. దరఖాసుల్లో పొరపాట్లను ఆన్లైన్లోనే పరిష్కరిస్తా మన్నారు.
పూర్తిగా పేరు మారిపోతే మీసేవ/హెల్ప్లైన్ కేంద్రాల్లో బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంలో చదువుకున్న వారు, ఇతర రాష్ట్రాల వారు, స్పెషల్ కేటగిరీల వారు తమ జిల్లాల్లోని హెల్ప్లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్కు హాజరుకావాలన్నారు.
మూడు దశల్లో కౌన్సెలింగ్: ఈసారి డిగ్రీ ప్రవేశాల కు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు దోస్త్ చర్యలు చేపట్టింది. ఈలోగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లి మెంటరీ ఫలితాలు రాకపోతే స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తోంది.
కాలేజీ స్థాయిలోనే విద్యార్థులు సీట్లను బట్టి గ్రూపుల మార్పు, మీడియం మార్చు కునేందుకు అధికారులే కౌన్సెలింగ్ నిర్వహించనున్నా రు. రాష్ట్రంలోని 1,173 డిగ్రీ కాలేజీలకు జియో ట్యాగిం గ్ చేస్తున్నారు. డిగ్రీలో చేరిన విద్యార్థి ఇంజనీరింగ్కు దరఖాస్తు చేసుకుంటే అక్కడ సీటు వచ్చి ఇంజనీరింగ్కు వెళ్తే డిగ్రీలో ఆటోమేటిగ్గా సీటు రద్దయ్యేలా రెండు ప్రవేశాలకు ఆన్లైన్ లింకు చేశారు.
‘ఆ కాలేజీలపై చర్యలు’
యూనివర్సిటీలు నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా వసూలు చేయడం సరికాదని, అలాంటి కాలేజీలపై చర్యలు చేపడతామని కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. రాష్ట్రంలో 19 కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు కోర్టును ఆశ్రయించాయన్నారు.
సీట్ల వివరాలివీ.. (2017–18)
యూనివర్సిటీ సీట్లు
కాకతీయ 1,29,257
మహత్మాగాంధీ 38,240
ఉస్మానియా 1,46,240
పాలమూరు 32,850
శాతవాహన 47,470
తెలంగాణ 27,890
(ఇందులో వరుసగా మూడేళ్లలో 25 శాతం లోపు భర్తీ కాని సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది)