డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్! | Drugs .. Goa to Hyderabad! | Sakshi
Sakshi News home page

డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్!

Aug 18 2016 3:32 AM | Updated on May 25 2018 2:29 PM

డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్! - Sakshi

డ్రగ్స్.. గోవా టు హైదరాబాద్!

గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ ....

అంతర్రాష్ట్ర డ్రగ్స్ గ్యాంగ్ గుట్టురట్టు నైజీరియన్ల దందా
ఏడుగురి అరెస్టు..  కొకైన్, బ్రౌన్‌షుగర్ స్వాధీనం


హైదరాబాద్: గోవా కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో మాదకద్రవ్యాల దందా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టుచేశారు. మొత్తం ఏడుగురు నిందితుల్ని అరెస్టు చేశామని, వీరి నుంచి 73 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల బ్రౌన్‌షుగర్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం మీడియాకు తెలిపారు. నైజీరియాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రఫెల్, అనోరా, సొలోమెన్, పీటర్, సామ్సన్, చుకు, ప్రామిస్ 2012-2015 మధ్య బిజినెస్ వీసాతో భారత్‌కు వచ్చారు. కోయంబత్తూర్‌లో వస్త్రాలు ఖరీదు చేసి నైజీరియాకు ఎక్స్‌పోర్ట్ చేసే వ్యాపారులుగా స్థిరపడ్డారు. సొలోమెన్, చుకు, ప్రామిస్ నగరంలోని బండ్లగూడ, సైనిక్‌పురి, టోలిచౌకి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. మిగిలిన నలుగురూ గోవాలో ఉంటున్నారు. లాటిన్ అమెరికా దేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా కొకైన్‌ను సమీకరిస్తున్న రఫెల్ దీన్ని విక్రయించడానికి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడికైనా డ్రగ్ సరఫరా చేయడానికి అనోరా, పీటర్‌ను వినియోగించుకునే వాడు. వీరిద్దరూ బస్సులు, రైళ్లల్లో ఆయా ప్రాంతాలకు వెళ్లి స్థానిక ఏజెంట్లకు డ్రగ్స్ ఇచ్చి వచ్చేవారు.

 
రూ. 2.5 వేలకు కొనుగోలు, రూ.5 వేలకు విక్రయం..

ఈ మాదక ద్రవ్యాన్ని గ్రాము రూ.2,500 నుంచి రూ.3 వేలకు రఫెల్ కొనేవాడు. దీన్ని ఏజెంట్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపి గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేలకు అమ్మేవాడు. ఆయా నగరాల్లో కస్టమర్లుగా ఉన్న విద్యార్థులు, యువతకు భారీ మొత్తానికి విక్రయిస్తున్నారు. ప్రామిస్ అనే నైజీరియన్ జాన్ అనే మరో వ్యక్తి నుంచి కొకైన్, బ్రౌన్‌షుగర్ ఖరీదు చేసి విక్రయిస్తున్నాడు. రఫెల్‌తో పాటు నిందితులంతా హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. సీసీఎస్‌లోని నార్కొటిక్ సెల్ అధికారులతో కలసి వలపన్ని ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిపై హైదరాబాద్‌తో పాటు గోవా, ముంబై తదితర నగరాల్లో కేసులున్నాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. మాదకద్రవ్యాల దందాలో సంపాదించిన మొత్తాన్ని ఈ ముఠా తమ స్వదేశానికి వస్త్రాల రూపంలో పంపేస్తున్నారు. ప్రతి డీల్‌లోనూ వచ్చిన లాభాలతో కోయంబత్తూర్‌లో రెడీమేడ్, ఇతర వస్త్రాలు ఖరీ దు చేస్తున్నారు. వీటిని నైజీరియాకు ఎక్స్‌పోర్ట్ చేస్తూ, తమ అనుచరులు ద్వారా అమ్మించి సొ మ్ము చేసుకుంటున్నారు. కేసును తదుపరి ద ర్యాప్తు నిమిత్తం యాంటీ నార్కొటిక్స్ సెల్‌కు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement