కలహాల వల్లే పార్టీకి తీవ్ర నష్టం | congress leaders vh palvai meets Sonia Gandhi over Telangana state | Sakshi
Sakshi News home page

కలహాల వల్లే పార్టీకి తీవ్ర నష్టం

Jun 28 2016 2:31 AM | Updated on Oct 22 2018 9:16 PM

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)లోని అంతర్గత కలహాల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని...

కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో వీహెచ్, పాల్వాయి భేటీ
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)లోని అంతర్గత కలహాల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద వాపోయారు. సోమవారం ఢిల్లీలో సోనియాను కలుసుకొని తెలంగాణలోని తాజా రాజకీయపరిస్థితిని వీహెచ్, పాల్వాయి వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందనే భావన ప్రజల్లో ఇప్పటికీ పదిలంగా ఉందని, అధికారంలో ఉన్నంతకాలం కొందరు నాయకులు పదవులను వాడుకొని తాజాగా పార్టీని వీడారని, అయితే కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారని చెప్పారు.

భేటీ తర్వాత వారు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నిర్వహణకు అందరూ సహకరించేలా చూడాలని పార్టీ అధ్యక్షురాలిని కోరామని చెప్పారు. కొంతమంది గ్రూపులను నిర్వహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించేందుకు పార్టీ పునర్నిర్మాణం, బలోపేతానికి  క్షేత్రసాయి నుంచి కృషి చేస్తామని సోనియాకు తెలిపామని పాల్వాయి చెప్పారు. బంగారు తెలంగాణ పేరిట సీఎం కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు.
 
కాపు కులాలపై ఆరా: ఈ భేటీలో కాపులను బీసీ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంలో కాపులలో ఎన్ని కులాలున్నాయని సోనియా ఆరా తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement