జల జగడాలకు చెక్‌ | Check to Water defiance | Sakshi
Sakshi News home page

జల జగడాలకు చెక్‌

Feb 6 2017 3:27 AM | Updated on Sep 2 2018 5:28 PM

అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగు వేయనుంది.

ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్న కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించే దిశగా కేంద్రం ముందడుగు వేయనుంది. అన్నీ కుదిరితే పార్లమెంటు ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే జల జగడాలకు శాశ్వత పరిష్కారం చూపే రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో ఒకటి దేశంలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను విచారిం చడానికి ప్రస్తుతమున్న వివిధ ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే బిల్లు కాగా, అంతర్రాష్ట్ర వివాదాలన్నింటినీ చర్చలు, మధ్యవర్తుల ద్వారానే పరిష్కరించుకునేలా చూసే జాతీయ జల విధాన బిల్లు మరొకటి. ఇందులో ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు తెలంగాణ అంగీకారం తెలుపగా జాతీయ జల విధానంపై సైతం అభిప్రాయాలు కోరుతూ కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.

జల ఒప్పందాలపై 30 ఏళ్లకోసారి సమీక్ష...
నదీ జలాలపై రాష్ట్రాలకు ఉండే హక్కులు, ట్రిబ్యునల్‌ తీర్పుల అమలు, వాటి సమీక్షలకు అనుగుణంగా ‘జాతీయ జల విధాన బిల్లు–2017’ను తెచ్చేందుకు కేం ద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై అభిప్రాయాలను తెలపాలని రాష్ట్రాలను కోరింది. బిల్లులో పేర్కొన్న అంశా ల్లో అంతర్రాష్ట్ర వివాదాల అంశానికి ప్రాధాన్యం కల్పించా రు. ఈ బిల్లు ప్రకారం అంతర్రాష్ట్ర వివాదాలన్నింటినీ చర్చలు, మధ్యవర్తుల ద్వారానే పరిష్కారించుకోవాల్సి ఉంటుంది. వివాదం తలెత్తే పరిస్థితి ఉంటే అది జటిల మయ్యే వరకు చూడకుండా ముందుగానే పరిష్కారం కనుగొనాల్సి ఉంటుంది. అంతర్రాష్ట్ర జల ఒప్పందాలను 30 ఏళ్లకోసారి సమీక్షించేలా ఈ బిల్లు ఉండనుందని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది.

మూడేళ్లలో తీర్పు..
రాష్ట్రాల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించే దిశగా ఒకే ట్రిబ్యునల్‌ అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించనుంది. ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్‌కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ ట్రిబ్యునల్‌ మూడేళ్లలో తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement