జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు | sanwarlal answers over kaleshwaram project | Sakshi
Sakshi News home page

జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదన రాలేదు

Mar 11 2016 3:18 AM | Updated on Sep 3 2017 7:26 PM

కాళేశ్వరం ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదననేది తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర జల సంఘానికి అందలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్ తెలిపారు.

 ‘కాళేశ్వరం’పై కేంద్ర జలవనరుల శాఖ సహాయమంత్రి సమాధానం
 సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ఎత్తిపోతలను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదననేది తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర జల సంఘానికి అందలేదని కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సన్వర్‌లాల్ జాట్ తెలిపారు. లోక్‌సభలో గురువారం టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ 16 ప్రాజెక్ట్‌లను కేంద్రం ఇప్పటికే జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించిందని, అదనంగా 14 ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదనలు పంపాయని చెప్పారు. తెలంగాణకు చెందిన ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించాలనే ప్రతిపాదన అందిందని, అయితే, ఈ ప్రాజెక్ట్‌కు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు చెందిన సలహా సంఘం ఆమోదం లభించాల్సి ఉందని సన్వర్‌లాల్  తెలిపారు. 

కాళేశ్వరంపై కేంద్రమంత్రి ఇచ్చిన జవాబుతో జితేందర్‌రెడ్డి అంగీకరించలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, అందుకు అనుగుణంగానే కాళేశ్వరం, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్ట్‌లను జాతీయ ప్రాజెక్ట్‌లుగా ప్రకటించే ప్రతిపాదనలను పరిశీలించాలని ప్రధానమంత్రి, జలవనరులశాఖ మంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి గతనెలలో లేఖ రాశారని జితేందర్‌రెడ్డి పేర్కొన్నారు. జువ్వాది చొక్కారావు ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన వ్యయ అంచనాలతో కూడిన పెట్టుబడులకు సంబంధించిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం ఇంకా అందించాల్సి ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
 
సిరిసిల్లలో పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలి: ఎంపీ వినోద్
 సాక్షి, న్యూఢిల్లీ: సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఎంపీ బి.వినోద్‌కుమార్ కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement