ఏది హాస్యం! ఏది అపహాస్యం!

Sri Ramana Satirical Story On Chandrababu Over His Cheap Politics - Sakshi

అక్షర తూణీరం

కొన్ని వేల సంవత్సరాల నాడే అరిస్టాటిల్‌ మహాశ యుడు ‘నేటి మన యువత వెర్రిపోకడల్ని గమనిస్తుంటే, రానున్న రోజుల్లో ఈ సమాజం ఏమి కానున్నదో తల్చు కుంటే భయం వేస్తోంది’ అని పదేపదే నిర్వేదపడేవాడు. మూడువేల సంవ త్సరాల తర్వాత కూడా ఏమీ కాలేదు. ఎప్పుడూ అంతే, నాన్నలకి పిల్లల ధోరణి విపరీతంగా కనిపి స్తుంది. పిల్లేంచేసినా ఏదీ ఒక సక్రమ మార్గంలో ఉండదని తండ్రులు ప్రగాఢంగా భావించేవారు. పిల్లలు హాయిగా నవ్వుకుంటూ తమ జీవితం తాము గడిపేవారు.

అరిస్టాటిల్‌ నించి మోతీలాల్‌ దాకా ‘ఈ ప్రజాస్వామ్యం పెడదోవ పడుతోంది. బహుపరాక్‌’ అంటూ హెచ్చరించినవారే. ఇటీవలి కాలంలో మళ్లీ చంద్రబాబులో అరిస్టాటిలూ ఇతర విశ్వవిఖ్యాత తత్వవేత్తలూ తొంగి తొంగి చూస్తు న్నట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే సహించేది లేదని నిన్న మొన్న కూడా తీవ్ర స్వరంతో హెచ్రించారు. రాచరికాలు నడిచే రోజుల్లో కూడా ఓ మూల ప్రజాస్వామ్యం నడుస్తూ ఉండేది. రాణివాసపు ఆప్తులు, రాజాశ్రితులు, రాజబంధు వులు, రాజోద్యోగులు, అక్రమ సంతాన మొగమాట స్తులు ఇలా చాలామంది వీధులకు తీరి ఉండేవారు.

రాజుగారి పాలనలో అంతా సమానమేగానీ పైన చెప్పినవారు మరింత ఎక్కువ సమానం. మరీ ఓ వారం పదిరోజుల్నించి చంద్రబాబుకి ప్రజా స్వామ్యం మీద బెంగ ఎక్కువైంది. పిల్లికి రొయ్యల మొలతాడన్నట్టు అచ్చ తెలుగు సామెత ఉంది. చంద్రబాబు నలభై ఏళ్ల ఇండస్ట్రీని ఒక్కొక్క ఫ్రేము చూస్తే– తెలుగునాట డెమోక్రసీ ఎన్ని ఫ్రేముల్లో గీతలు చారలు పడిందో మనం చూడవచ్చు.

కొంచెమైనా వెన్ను ముదరకుండానే లోకేశ్‌ బాబుని పెరటి గుమ్మంలోంచి ప్రవేశపెట్టి మంత్రి పదవి కూడా ఇచ్చేసి సభలో కూచోపెట్టినపుడు ప్రజాస్వామ్య దేవత ఆనంద తాండవం చేసిందా? నేతలు పుడతారు. మనం తయారుచేస్తే అవరు. చంద్రబాబుకి తొలినుంచీ సహనం చాలా తక్కువ. కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినా, ఎన్టీఆర్‌ పవర్‌లోకి రాగానే దండవేసి మామగారి చంకనెక్కి కూచు న్నారు. అది అపహాస్యం కాదు. ప్రజాస్వామ్య పరి రక్షణ. తర్వాత మామగారిని పాతాళానికి తొక్కేసి నపుడు కూడా అది ధర్మసమ్మతమే. చంద్రబాబుకి గడిచిన 9 నెలలూ తొమ్మిది యుగాలుగా అనిపి స్తోంది. పదవీ విరహ వేదనతో మనిషి చలించి పోతున్నాడు. సరైన ఆలోచనలు రావడం లేదు.

తను పవర్‌లో ఉండగా నెగ్గిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి గిట్టుబాటు ధరలతో ఎమ్మార్పీలు నిర్ణయించి మూకుమ్మడిగా కొనుగోలు చేసినపుడు ప్రజా స్వామ్యం చంద్రబాబుపై పూలవాన కురిపిం చిందా? చెప్పాలి. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్ని కలు తీవ్రస్థాయికి చేరాయ్‌. చంద్రబాబుకి అభ్య ర్థుల కొరత తీవ్రంగా ఉందని ప్రజలు చెప్పుకుం టున్నారు. జగన్‌ ప్రభు త్వం మద్యంమీద నిఘా పెట్టింది. ఇది కూడా బాబుకి పెద్ద మైనస్‌. ఎన్నికల కమిషన్‌ చెయ్యాల్సిన పనులు మీరెందుకు చేస్తున్నా రని జగన్‌పై రంకెలు వేస్తున్నారు. ఇంకోపక్క మెడ మీద తలకాయలున్న నాయకులు అటుపక్కకి జారి పోతున్నారు. ఇలా సతమతమవుతున్న తరుణంలో అంతా అపహాస్యంగా కనిపిస్తోంది.

నిజానికి చంద్రబాబు ఎన్నికల బరిలో ముఖా ముఖి తలపడి నెగ్గిన బాపతు కాదు. వాజ్‌పేయి బొమ్మని అడ్డం పెట్టుకుని గెలుపు సాధించారు. చంద్రుడి స్వయంప్రకాశం ఎన్నడూ లేదు. మొన్న కూడా దేశ రాజకీయాలతో ఆడుకోవాలనుకున్నాడు గానీ అడుగు కూడా పడలేదు. మోదీతో తేడా పెరిగింది. ఆ తేడా తగ్గించుకోవడానికి బాబు చాలా యాతన పడుతున్నారు. మనం చేసిన మంచి చెడులూ మన వెనకాలే పడి మనల్ని వేటాడతా యన్నది నిజం.

ఒక గుహ దగ్గరకు వెళ్లి మనం ఏది అరిస్తే అదే ప్రతిధ్వనిస్తుంది. అన్యాయం అని అరిస్తే అన్యాయం అని మారు పలుకుతుంది. రాజ కీయాల్లో కొన్ని కొన్ని మాటలు నేతి బీరకాయ చందం. ఆధునిక కాలం రాజకీయాలు కూడా వ్యాపార సరళిలోనే నడుస్తున్నాయి. అందులో ఉన్న నిజాయతీని మాత్రమే చూసి ముచ్చటపడాలి. భూమి తన చుట్టూ తాను తిరిగితే ఒకరోజు. ఆ లెక్కన ఎంత తగ్గించినా నాలుగేళ్లు గడవాలి. అందాకా చంద్రబాబు ఈ ప్రజాస్వామ్యంలో గడ పక తప్పదు.   

వ్యాసకర్త: శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top