ఉత్తమాభిరుచికి మారుపేరు నవోదయ

Sri Ramana Article On Navodaya Publications - Sakshi

అక్షర తూణీరం

ఒకప్పుడు బెజవాడ ఏలూరు రోడ్డంటే పుస్త కాల మక్కా. ‘ఏ పుస్తక మైనా సరే– ఏలూర్‌ రోడ్‌ ఛలో’ అనేవారు. తర్వాత అదే కారల్‌మార్క్స్‌ వీధిగా వాసికెక్కింది. అందులో నవోదయ బుక్‌ షాప్‌ ఒక ల్యాండ్‌ మార్క్‌! అర్ధ శతాబ్దిపాటు నవోదయ ఒక వెలుగు వెలిగింది. మంచి చరిత్ర ఉంది. తెలుగు ప్రాచీన గ్రంథాల ప్రచురణలో వావిళ్ల వారికున్న కీర్తిప్రతిష్టల్ని ఆధునిక సాహిత్య ప్రచురణలో నవో దయ గడించింది. నవోదయ రామమోహనరా వుగా పేరు తెచ్చుకున్న అట్లూరి 1934లో గన్న వరం తాలూకా ఉంగుటూరులో జన్మించారు. స్కూల్‌ ఫైనల్‌ దాకా చదువుకున్న రావుకి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషలలో మంచి ప్రవేశం ఉంది. పుస్తకాల ప్రూఫ్‌లు దిద్దడంలో ఆయన నిక్కచ్చ యిన మనిషి.

మొదట్లో నవోదయ అంటే కమ్యూ నిస్ట్‌ సాహిత్యమని పేరుండేది. తర్వాత్తర్వాత విలు వలున్న అభ్యుదయ రచనలకు అచ్చులు కల్పిం చారు. బాపురమణల స్నేహం దొరకడంతో నవో దయ అందమైన మలుపు తీసుకుంది. పుస్తకం సైజు, బాపు దిద్దిన ముఖచిత్రం, బాపు మార్క్‌ కోతి అక్షరాలు, ఇంకా ఎన్నో చిలవలు పలవలతో నవోదయ పబ్లికేషన్స్‌ పుస్తకాల మార్కెట్‌ని అలంకరించేవి. ఆ క్రమంలో ముళ్లపూడి వెంకట రమణ పుస్తకాలు గిరీశం లెక్చర్లు, రుణానందల హరి, బుడుగు విడివిడిగా బాపు రమణీయంగా వెలువడ్డాయ్‌. బాపు కార్టూన్‌ సంపు టాలు వెలువడి నవ్వులు పండిం చాయి.

చాలామంది రచయితలు తమ పుస్తకాలు నవోదయ బ్యానర్‌పై వస్తే బాగుండునని కలలు కనేవారు. వీఆర్‌ నార్ల సీత జోస్యం, నండూరి రామ మోహనరావ్‌ విశ్వరూపం, నరావ తారం సి. రామచంద్రరావు వేలుపిళ్లై, శ్రీరంగం నారాయణ బాబు రుధిర జ్యోతి, ఆరుద్ర పుస్తకాలు నవోదయ పేరుకి పెద్ద పీట వేశాయి. పుస్తకాలు పెట్టిచ్చే కాగితం కవర్లమీద బాపు కొంటె బొమ్మలు చిత్రాతిచిత్రంగా ఉండేవి. కస్టమర్లు కవర్లని కూడా దాచుకొనేవారు. బాపు గీసిన ప్రతి గీతని, వేసిన ప్రతిగీతని వాడుకుని అందమైన గ్రీటింగ్‌ కార్డ్స్‌ని రూపొందించేవారు. నవోదయ షాపు ఎప్పుడు చూసినా ‘బాపు బొమ్మల కొలువులా’ పరిమళిం చేది. ఆ తర్వాతి కాలంలో సత్యం శంకరమంచి విరచిత అమరావతి కథలు బాపు రేఖా చిత్రాలతో రమణ ముందుమా టతో వెలువడి సంచలనం సృష్టించింది. ఇంద్ర గంటి హనుమచ్ఛాస్త్రి, శ్రీకాంత శర్మ, శ్రీరమణ ఇత్యాదులు నవోదయ ఆథర్స్‌. మీరంతా మా ఆధ రువులని రావు తరచూ చమత్కరిస్తుండేవారు.

నవోదయకి గుంటూరులో కూడా అన్ని హంగులతో శాఖ వెలిసింది. అప్పటి గుంటూరు మెడికోలలో చాలామందికి నవోదయ స్టెత స్కోప్‌ లాంటిది. అప్పట్నించీ డాక్టర్‌ జంపాల చౌదరి నవో దయ అభిమానిగా ఉన్నారు. తానా సంస్థకి మూల స్తంభం. రామ్మోహనరావుపై చాలా చాలా ఇష్టం కొద్దీ రావు దంపతుల్ని ఒక తానా ఉత్సవా లకు గౌరవంగా రప్పించి సత్క రించారు. కడదాకా రావుగారి యోగక్షేమాలు తెలుసుకుంటూ, వైద్య సలహాలిస్తూ డాక్టర్‌ జంపాల నవోదయ రుణం తీర్చుకున్నారు. అప్పటి ఎమెస్కో యజమాని ఎమ్మెన్‌ రావు, పలు వురు ఢిల్లీ ప్రచురణ కర్తలు డా‘‘ రావుతో ఆత్మీ యంగా ఉండేవారు.

గడచిన రెండు మూడు దశాబ్దాలలో జనరల్‌ బుక్స్‌ వైపు చూసేవారు తగ్గి పోయారు. దాంతోబాటే నవోదయ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. దాదాపు ముప్ఫై ఏళ్లనాడు ‘విజయవాడ బుక్‌ ఫెయిర్‌’ ఒక మహోత్సవంగా జరగడానికి నవోదయ రామ్మోహనరావు కార కులు. కమ్యూనిస్ట్‌ భావాలు, హేతువాద తత్వం కలిగిన రావు ఎప్పుడూ ఎక్కడా రాజీ లేకుండానే 86 ఏళ్ల జీవితం గడిపారు. 1955లో పర్వతనేని ఝాన్సీ, నవోదయ రామ్మోహనరావు ఇష్టపడి వివాహమాడారు. ఝాన్సీ నవోదయ సంపాదించు కున్న ‘గుడ్‌విల్‌’కి కొమ్ముకాశారు. బాపు రమణ లకు నిత్యం ఒకసారైనా ఫోన్‌లో మాట్లాడక అయ్యేది కాదు. బాపు ముద్దుగా రావుని ‘మావో గారూ!’ అని పిలిచేవారు. ఆ త్రయం కనుమరు గైంది. తెలుగు అక్షరానికి పెద్ద లోటు.
వ్యాసకర్త : శ్రీరమణ, ప్రముఖ కథకుడు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top