కుల్‌తిక్రి మహరాణి పంచాయతీ | Uncle tikri queen, the panchayat | Sakshi
Sakshi News home page

కుల్‌తిక్రి మహరాణి పంచాయతీ

Feb 2 2016 9:37 PM | Updated on Sep 3 2017 4:49 PM

కుల్‌తిక్రి  మహరాణి  పంచాయతీ

కుల్‌తిక్రి మహరాణి పంచాయతీ

జార్జి బెర్నాడ్ షా ఏనాడో చెప్పిన ఈ సామాజిక సత్యాన్ని గత ఇరవై ఏళ్లుగా ఆచరణలో పెడుతున్నారు

Progress is impossible without change, and thosewho cannot  change their  minds cannot change anything.

జార్జి బెర్నాడ్ షా ఏనాడో చెప్పిన ఈ సామాజిక సత్యాన్ని గత ఇరవై ఏళ్లుగా ఆచరణలో పెడుతున్నారు పశ్చిమ బెంగాల్‌లోని కుల్‌తిక్రి గ్రామస్తులు. వాళ్ల గ్రామం అభివృద్ధి చెందాలంటే పాలనలో మార్పు రావాలని గ్రహించారు. ఆ పాలనాధికారాన్ని స్త్రీలకిస్తే మరింత మంచి మార్పు వస్తుందని భావించారు.  అన్నట్టుగానే 20 ఏళ్ల కిందట కుల్‌తిక్రి గ్రామ పంచాయతీ తాళాలను మహిళలకు అప్పగించారు. అయితే ఇది రిజర్వేషన్ ఇచ్చిన  చాన్స్ కాదు. ప్రజలు ఓటుతో ఇచ్చిన తీర్పు.  మహిళా సాధికారతలో ఇప్పుడు ఆ గ్రామం దేశానికే  మోడల్!
 
 
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మెదినిపూర్ జిల్లాలో ఉంటుంది కుల్‌తిక్రి.  ఒకప్పుడు మావోయిస్ట్‌ల పట్టు ఈ ప్రాంతం. ఇప్పుడు స్త్రీ సాధికారతకు చిహ్నం.  ఇరవై ఏళ్ల కిందట అంటే మహిళలకు అధికారం రాక మునుపు..  దేశంలోని చాలా ఊళ్లలాగే ఇదీ మత్తులో జోగేది. నిరక్షరాస్యత నీడలో నిద్రపోయేది. ఆడవాళ్లను హింసించేది. ఏ అభివృద్ధీ లేక చుట్టచుట్టిన గొంగళిలా ఓ మూలన పడి ఉండేది. వీటన్నిటినీ భరించిన ఆ ఊరి సహనం (ముఖ్యంగా స్త్రీల ఓపిక) గరిష్ట స్థాయిని దాటింది. ఎదురు తిరగడం, తిరిగి ప్రశ్నించడం మొదలు పెట్టింది. ఈ ఊరు ఇలా ఎందుకుంది? ఇంకోలా ఎందుకు ఉండకూడదు? అని ఆలోచించింది. ఊరిని శాసించే పెద్దల్లో మార్పు రావాలి. అంటే అధికారం మారాలి! ఆ అధికారాన్ని స్త్రీలెందుకు తీసుకోకూడదు అనుకుంది.

ఈ సంధి స్థితిలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలొచ్చాయి. ప్రతి వార్డు నుంచి సభ్యులుగా స్త్రీలూ నిలబడ్డారు. పురుష అభ్యర్థులు ఓట్లేసే మగాళ్లకు మందు రుచి చూపిస్తుంటే.. స్త్రీలు.. అధికారం తమకిస్తే కుల్‌తిక్రి భవిష్యత్ ఎలా ఉంటుందో వివరించడం మొదలుపెట్టారు. ఆ ఊళ్లోని మహిళలంతా మహిళా అభ్యర్థులకే మద్దతు పలికారు. ఆ మహిళలే ఓటు హక్కున్న యువతనూ ప్రభావితం చేయగలిగారు. పురుషులు మాత్రం పురుషులకే వత్తాసు పలికారు. ఎన్నికలయ్యాయి. ఫలితాలు వచ్చాయి. స్వల్ప మెజార్టీతో స్త్రీలే గెలిచారు.
 
ఈ అవకాశం చాలు..
గెలిచిన మహిళలు ఊరి గతి మార్చాలని అనుకున్నారు. ఓడిన మగవాళ్ల అహం వారికి ఎన్నో అడ్డంకుల్ని పేర్చింది. అవమానాలనూ విసిరింది. అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కొని పంచాయతీ మెట్లెక్కారు. ప్రతి సమస్య నుంచి ముందుగా తాము పాఠాలు నేర్చుకుంటూ గ్రామానికి పరిష్కారాలు చూపించసాగారు. మొదటితరం మహిళా ప్రతినిధులు కుల్‌తిక్రిలో చేపట్టిన మొదటి పని.. అక్కడి ఆడవాళ్లను అక్షరాస్యులను చేయడం. రెండోది.. ఊళ్లో వాళ్లకు పని కల్పించడం. ఈ రెండిటి వల్ల మద్యం దానంతట అదే వెనక్కి వెళ్లిపోయేలా చేయగలిగారు. చిత్రంగా ఆ అయిదేళ్లలో వాళ్లు ఒక్కసారి కూడా మద్యం గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడలేదట.
 
రెండోసారి..
ఆ అయిదేళ్లలో చేసిన ఈ పనులకు మహిళలకు మంచి మద్దతు లభించింది. రెండోసారి పెద్దగా కష్టపడకుండానే అధికారం వచ్చింది. అయితే ఈ విడత కొత్త అభ్యర్థులు అవకాశం పొందారు. పంచాయతీ నిధులను సక్రమంగా ఖర్చుపెట్టారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన తెచ్చారు. స్త్రీల అక్షరాస్యతను మరింత పెంచారు. స్త్రీ సాధికారత మీదా దృష్టి పెట్టారు. స్థానికంగా ఉన్న వృత్తులు, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారు. స్థానిక మార్కెట్‌ను వృద్ధి చేశారు. ఆ మార్కెట్‌లోకి మధ్యవర్తులు జొరబడకుండా కట్టుదిట్టం చేశారు. ఇవన్నీ ఆ ఊరికి ఊతమిస్తూనే అక్కడి ఆడవాళ్లనూ ఆర్థికంగా నిలబెడుతున్నాయి. అందుకే తర్వాత కూడా కుల్‌తిక్రీ గ్రామ పంచాయతీ మహిళల చేతుల్లోకే వచ్చింది.
 
మూడోసారి..
ఈ సారి యువతరం అధికారంలోకి వచ్చింది. కనీస విద్యార్హత ఇంటర్ ఉన్న వాళ్లు పంచాయతీ సభ్యులయ్యారు. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ యాక్ట్ కింద ఉన్న నిధులను చక్కగా వినియోగించారు.  అంతకుముందు టెన్త్ వరకే ఉన్న బడిని డిగ్రీ వరకు పెంచుకోగలిగారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించారు. దిగుబడులను పెంచారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు. ఇందులో స్త్రీలకు శిక్షణనూ ఇప్పించి వాళ్లను గ్రామీణ పారిశ్రామికవేత్తలుగా మార్చారు. ఈ యవ పంచాయతీ సభ్యులు అందరూ మధ్యాహ్నం వరకు ఊరి సమస్యలు చూసి మధ్యాహ్నం నుంచి కాలేజీకి వెళ్లేవారు.

ఇప్పుడు..
అభివృద్ధికి పిన్‌కోడ్‌గా కుల్‌తిక్రీని ఇవ్వచ్చు.  ఆ గ్రామం 70 శాతం మహిళా అక్షరాస్యత, 60 శాతం పురుషుల అక్షరాస్యత సాధించింది. తాజా పంచాయతీలో 20 ఏళ్ల నుంచి 36 ఏళ్లలోపు మహిళలే. వీళ్లలో కొందరు గ్రాడ్యుయేట్స్, ఇంకొందరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. గ్రామంలో  కూడు, గుడ్డ, గూడుతోపాటు అందరికీ భూమి కూడా ఉంది. చేతినిండా పనుంది. అయితే అంతా సవ్యంగా సాగుతుంటే సహించని వాళ్లు కుల్‌తిక్రీలోనూ ఉన్నారు. మొదట మహిళలకేంటీ అధికారం ఇచ్చేదీ అంటూ అడ్డు తగిలారు. కుదరకపోయే సరికి ఇప్పుడు ఆ గ్రామాన్ని మహిళా రిజర్వేషన్ కిందికి తేవాలని ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల తమకు అనుకూలంగా ఉన్న వర్గంలోని స్త్రీని నిలబెట్టి అధికారం వాళ్లు చలాయించాలనే కుటిలయత్నం చేస్తున్నారు. ఇది నేటి యువతరం ముందున్న పరీక్ష. ఎదుర్కోవడానికే సిద్ధమే అంటున్నారు.            
 
 అధికారమూ ఉంది.. పోరాటమూ ఉంది
 ఇరవై ఏళ్ల నుంచి మా ఊరిని మహిళలే మహరాణులు. స్వచ్ఛందంగా దీన్ని ఆల్ విమెన్ పంచాయతీ చేశారు మా ముందుతరం వాళ్లు. ఆ వారసత్వాన్ని మేం నిలబెడ్తున్నాం. నీతి, నిజాయితీలో ఏమాత్రం తగ్గకుండా! కానీ ఈ మధ్యే ఈ యూనిటీని చెడగొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమన్ రిజర్వేషన్ విలేజ్‌గా మారిస్తే కావల్సిన వాళ్లను సర్పంచ్‌గా పెట్టుకొని మిగిలిన సభ్యులుగా మగవాళ్లే ఉండి ఇష్టారాజ్యం చేయొచ్చని కుట్రలు పన్నుతున్నారు. కానీ మేం అలా కానివ్వం. పోరాడతాం. ఎక్కడిదాకా అయినా వెళ్తాం. సమస్యలను ఎలా చక్కదిద్దుకోవాలో మా పెద్దలు మాకు నేర్పారు.  అవసరమైతే మా సమస్యను ముఖ్యమంత్రి దగ్గరకీ తీసుకెళ్తాం. తనూ మహిళే కాబట్టి అర్థం చేసుకుంటుందనే భరోసాతో ఉన్నాం. ఆ నమ్మకం వమ్మయితే ఎలా పోరాడాలో కూడా మాకు తెలుసు. అధికారమే కాదు పోరాటమూ మా వారసత్వంలో ఉంది.  - అనామికా సాహు, సర్పంచ్, బెంగాలీ లిటరేచర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్, కుల్‌తిక్రీ
 
అవరోధాలకు ఎదురీత
 గ్రామస్థాయి ప్రజాస్వామ్యానికి ఇండియాలోనే చక్కటి నిదర్శనం కుల్‌తిక్రీ. 20 ఏళ్ల ఈ ఉనికిని చెడగొట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. వామపక్ష ఉద్యమాలకు కోట అయిన బెంగాల్‌లో కూడా ఫ్యూడల్ కోరలున్నాయని చెప్పడానికి కుల్‌తిక్రీలో జరుగుతున్న కుట్రలే నిదర్శనం.  - పార్థా ఖన్రా, స్థానిక సామాజిక కార్యకర్త
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement