బ్రహ్మాండ మోసం | "For those who do not have children, drugs | Sakshi
Sakshi News home page

బ్రహ్మాండ మోసం

Apr 21 2016 11:07 PM | Updated on Sep 15 2018 3:43 PM

బ్రహ్మాండ మోసం - Sakshi

బ్రహ్మాండ మోసం

మనిషిని దోచుకోవడానికి లక్షమార్గాలున్నాయంటారు.. ఇదిగో మహిళను దోచుకోవడానికి కోటి ఉన్నాయని నిరూపిస్తున్నారు! ఒళ్లు అమ్ముకునేలా చేశారు...

మనిషిని దోచుకోవడానికి లక్షమార్గాలున్నాయంటారు.. ఇదిగో మహిళను దోచుకోవడానికి కోటి ఉన్నాయని నిరూపిస్తున్నారు! ఒళ్లు అమ్ముకునేలా చేశారు... ఆ తర్వాత గర్భాన్ని అద్దెకిచ్చేలా చేశారు.. ఇప్పుడు ఏకంగా అండాలనే అమ్ముకునేలా చేస్తున్నారు! ఈ బ్రహ్మాండమోసంపై అవగాహన తెచ్చుకోవడమే కాక నలుగురికీ తెలియజేయడం అవసరమని సాక్షి నమ్ముతోంది! కొన్ని ఆంగ్లపత్రికల్లో మన రాష్ట్రంలో కూడా ఈ వ్యాపారం జరుగుతోందని తరచూ వార్తలు వస్తున్నాయి..  పేదరికం, అజ్ఞానమే ఈ బ్రహ్మాండమోసానికి విత్తులవుతున్నాయి!

ఎలా చేస్తారు?
ఆరోగ్యకరమైన మహిళ అండాశయం నెలకు ఒక అండాన్నే విడుదల చేస్తుంది. కానీ ఎగ్ డోనర్స్‌కు గొనాడోట్రాఫిన్స్ అనే హర్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి ఎక్కువ అండాలు విడుదలయ్యేలా చేస్తారు. తర్వాత డోనర్‌కు అనెస్తీషియా ఇచ్చి అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహాయంతో నీడిల్ ద్వారా ఈ అండాలను సేకరిస్తారు.

‘పిల్లలు లేని వాళ్లకోసం మందులు, ఇతర అన్నిరకాల సాధారణ పద్ధతులను అవలంబించాక.. అవి ఫలితం చూపించని పక్షంలో చివరి ప్రత్యమ్నాయ ప్రయత్నంగా మాత్రమే ఎగ్ డొనేషన్, సరోగసీ పద్ధతులకు వెళ్లాలి. కానీ మన దేశంలోని చాలా ఐవీఎఫ్ సెంటర్లు కేవలం ఈ రెండు పద్ధతుల మీదనే నడుస్తున్నాయి. వీటి డబ్బు ఆశకు సుష్మలాంటి మైనర్ పిల్లలు బలవుతున్నారు.’
- డాక్టర్ తాన్యా బి. రోహత్గి,   మ్యాక్ సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్‌‌, ఢిల్లీ.

సరైన మార్గదర్శకాలు లేవు
‘గొనడోట్రోఫిన్ హార్మోన్ ఇంజక్షన్ల మోతాదు విషయంలో పాశ్చాత్యా దేశాల్లోలాగా మన దగ్గర కచ్చితమైన నియమనిబంధనలు లేవు. పైగా ఐసిఎమ్‌ఆరే ఒక్క సైకిల్‌లో 14 అండాలను సేకరించవచ్చనే సూచననిస్తోంది. దాంతో వీటి మోతాదు డాక్టర్ల విచక్షణ, నైతికతమీదనే ఆధారపడి సాగుతోంది.

అందుకే చాలా ఐవీఎఫ్ సెంటర్లలో ఒక్కసారికే 18 అండాలను సేకరిస్తున్నారు. ఇంకొన్ని సెంటర్లలో అయితే ఈ ఇంజక్షన్ల మోతాదును డేంజర్ లెవెల్స్‌కి పెంచి ఒకేసారి 50 అండాలను సేకరించే సాహసం కూడా చేస్తున్నారు. ఇదే ఒవేరియన్ హైపర్ స్టిములేషన్‌కు దారితీస్తుంది. దీనివల్ల డోనర్‌లో హార్మోన్లు ఇంబాలెన్స్ అయి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. - సునీత మిత్తల్,  ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్‌లో ఐవీఎఫ్ యూనిట్ హెడ్

కళ్లను, కాలేయాన్ని దానమివ్వడం రొటీన్ అయింది. తన గర్భంలో శిశువును మోసే భాగ్యంలేని అమ్మకు బిడ్డను మోసిచ్చే అద్దె అమ్మలూ సర్వసాధారణమయ్యారు. విక్కి డోనర్లు.. ఆ ప్రభావంతో ఇప్పుడు ఎగ్ డోనర్లు... దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అండాలను దానం చేసే ప్రక్రియలో మైనర్ బాలికల ఉనికీ ఉలికిపాటుకు గురిచేస్తోంది. బిడ్డలు కావాలని కోరుకుంటున్న అమ్మలకు సంతాన ఆశను ఎంత కల్పిస్తుందో బిడ్డలున్న తల్లులకు గర్భశోకాన్నీ అంతే మిగులుస్తోంది. అండాన్ని దానం చేసే అమ్మాయిల కోసం గాలింపు గ్రామాల్లోనూ మొదలైంది. గాలం పేదరికమే.

సరోగసీలో పెళ్లయి, ఓ బిడ్డను కన్న అమ్మలను మాత్రమే అదీ ఇష్టపూర్వకంగా వస్తేనే వాళ్ల గర్భాన్ని అద్దెకు తీసుకుంటారు. ఇదే నియమం ఎగ్ డొనేషన్‌కూ వర్తిస్తుంది. కానీ పేదరికం పదిహేనేళ్లు నిండిన అమ్మాయిలనూ ఈ ప్రక్రియకు బలిపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ఊళ్లూ ... ఏజెంట్లను ఊరిస్తున్నాయి. అంతగా చదువు, ఆర్థిక స్థోమతలేని కుటుంబాలను కదిలించి.. డబ్బాశ చూపించి ఆ ఇంటి అమ్మాయిలకు ఐవీఎఫ్ సెంటర్ల దారి చూపిస్తున్నారు. ఇలా టీనేజ్ అమ్మాయిలను పావులుగా చేయడం.. వాళ్ల ఆరోగ్యానికి హానికరం.. ఒక్కోసారి ప్రాణంమీదకూ రావచ్చు అని వైద్యులు, సామాజిక కార్యకర్తలూ హెచ్చరిస్తున్నా... ఏజంట్ల మాయ యథేచ్చగా సాగుతూనే ఉంది. ఎగ్ డొనేషన్‌తో ప్రాణం పోగొట్టుకున్న ఓ ఆడకూతురి ఉదంతమూ ఉంది. ఆ అమ్మాయి పేరు సుష్మపాండే. ఊరు ముంబై.

 

2010లో జరిగిన ఆ సంఘటన ఏంటంటే...
సుష్మ ఒక సాధారణ అమ్మాయి. దిగువ మధ్యతరగతి కుటుంబంలోని అయిదుగురు సంతానంలో మూడవది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ వాళ్ల సొంతూరు. బతకడానికి ముంబై వచ్చారు. సాకినాకలో మకాం పెట్టారు. తండ్రి టాక్సీ డ్రైవర్. నెలకు నాలుగు వేలకు మించి సంపాదించలేడు. చదువంటే ప్రాణం ఆ పిల్లకు. ఒక్కసారి చెప్తే ఇట్టే గ్రహించేది పాఠాలను. స్కూల్లో టీచర్స్ కూడా చాలా ఇష్టపడేవారు చురుకైన పిల్ల అని. కానీ కుటుంబ అవసరాలు తీర్చడంలో తండ్రికి సహాయపడక తప్పలేదు. అందుకే ఎనిమిదవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చింది. అంధేరీలో ఉన్న చౌమాల్స్ డిపోలో పనికి కుదరింది. తండ్రితో సమానంగా జీతం తెచ్చేది. తన జీతంతోనే తమ్ముళ్లను చదివించసాగింది. ఇంకొన్ని గంటలు ఎక్కువ కష్టపడి తానూ చదువు కొనసాగించాలని ఆమె తపన. కానీ సాకినాక, అంధేరిల మధ్య తిరగడానికే సరిపోతోంది. కొత్త పనికి టైమే దొరకట్లేదు.

ఆ నిరాశలో ఉన్నప్పుడే .. 2009లో కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు ఆమెకు. వాళ్ల ద్వారే ఆమెకు  రొతుండా ది సెంటర్ ఫర్ హ్యుమన్ రిప్రొడక్షన్’ గురించి తెలిసింది. ఆ స్నేహితుల సహాయంతో  2009, ఫిబ్రవరిలో మొదటిసారి ఆ ఆసుపత్రికి వెళ్లింది. మత్తు మందు ఇచ్చి పొట్టలోంచి ఏదో తీసుకుంటామన్నారు వైద్యులు. దాంతో పిల్లలు లేని వాళ్లకు పిల్లల్ని పుట్టిస్తాం అని చెప్పారు. ఆ మాట వినగానే బెదిరిపోయింది సుష్మ. ‘నాకెందుకో భయమేస్తోంది..నేను వెళ్తాను నన్ను వదిలేయండి’ అంది అక్కడికి తీసుకొచ్చిన స్నేహితులతో. ‘ఊరికే ఏం కాదు.. డబ్బులిస్తారు. నొప్పి కూడా ఏం ఉండదు’అని సర్ది చెప్పారు వాళ్లు. ‘పాతికవేలిస్తారు’ నొక్కిపలికారు. ‘పాతికవేలా?’ఒక్క రోజులో అంత డబ్బు. అంటే దాదాపు నా అయిదున్నర నెలల జీతం. ఈ డబ్బంతా దాచుకొని చదువుకోవచ్చు..’ సుష్మలో ఆశ.. ఆమెను ఆ పనికి ఒప్పుకునేలా ప్రేరేపించింది. ‘సరే’ అంది సుష్మ.

ఏవో టెస్ట్‌లు చేశారు. ఇంజక్షన్స్ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆసుపత్రిలో ఉంచుకున్నారు. అన్నట్టుగానే పాతికవేలు చేతిలో పెట్టారు. ఆ డబ్బుల్ని చూసుకుంటే ఆనందం మనసులో పట్టలేదు సుష్మకి. అందుకే మళ్లీ అక్టోబర్‌లో వెళ్లింది. అదే విధానం. మళ్లీ పాతికవేలు. ఇదిగో ఈ సారి.. ఆగస్ట్‌లో వచ్చింది. అయితే ఈసారి ఎప్పటిలా సాఫీగా సాగలేదు. హుషారుగా లేదు ప్రాణం. తెలియని సుస్తీ.. తెల్లవారి నుంచి కడుపునొప్పి చివరకు ప్రాణాన్ని తీసేసింది.

ది మర్డరర్...
ఆ హంతకురాలి పేరు ఎగ్ డొనేషన్. పదిహేడేళ్ల వయసులో చేయకూడని తప్పిదం.. జరగకూడని అనర్థం! కూతురు చనిపోయాక తెలిసింది ఆమె చేసిన పని గురించి తల్లి ప్రమీలకు.. ‘మీ అమ్మాయి ఎగ్ డొనేట్ చేసింది. అండాశయం నుంచి ఒకేసారి ఎక్కువ మొత్తంలో అండాలు ఉత్పత్తి కావడానికి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. అవి చూపించిన దుష్ర్పభావం వల్ల మెదడులో, ఊపిరితిత్తుల్లో రక్తస్రావం అయి మీ అమ్మాయి చనిపోయింది!’ అని. హతాశురాలైంది ప్రమీల. అప్పుడు రొతుండా ఆసుపత్రి మీద సాకినాక స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోస్ట్‌మార్టమ్ ఆ నివేదికలూ ఆ సత్యాన్నే వెల్లడి చేశాయి.  సుష్మకు ఎదురైన పరిస్థితిని వైద్యపరిభాషలో ఒవేరియన్ హైపర్ స్టిములేషన్ షాక్ సిండ్రోమ్ అంటారు. అంటే ఎక్కువ మొత్తంలో అండాలు ఉత్పత్తి కావడానికి చేసిన ఇంజెక్షన్ చూపించే దుష్ఫలతం అన్నమాట.

షాక్...
ఈ సంఘటన ప్రమీలకే కాదు దేశానికే అశనిపాతమైంది. సమాజం వెన్నులో వణుకు పుట్టింది. నిరసనలు... ధర్నాలు.. ర్యాలీలు మొదలయ్యాయి. ఇలా మైనర్ ఆడపిల్లల నుంచి అండాలు సేకరించడమేంటి? అసలు ఐసీఎమ్‌ఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం అంటోంది? దీనికి సంబంధించి ప్రత్యేకమైన చట్టం ఎందుకు తేకూడదు? అనే చర్చలు,వాదనలు మిన్నంటాయి. అప్పుడు.. అలా వచ్చిందే ఏఆర్‌టీ (అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్) బిల్, 2010. ఆరేళ్లు అవుతున్నా ఈ బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించలేదు. అయితే సుష్మ మరణం తర్వాత ఎగ్ డొనేషన్‌కు సంబంధించి ఐసీఎమ్‌ఆర్ కొన్ని నింబంధనలను మాత్రం ఖాయం చేసింది.

అవేంటంటే...
21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల నుంచే అండాలను సేకరించాలి  డోనర్ బ్లడ్‌గ్రూపే కాకుండా శారీరక దారుఢ్యం, ఎత్తు, బరువుతోపాటు విద్యార్హతలు, వృత్తినీ నమోదు చేయాలి  ఒకే డోనర్ దగ్గర వెంటవెంటనే కాకుండా కనీసం మూడు నెలల వ్యవధిని పాటించి అండ సేకరణ చేయాలి  ఒక డోనర్ దగ్గర్నుంచి ఆమె జీవితకాలంలో ఆరుసార్లు మాత్రమే అండాలను తీసుకోవాలి.

 

జాగ్రత్త: పెద్ద నగరాల్లోని సంతాన సాఫల్యకేంద్రాల సక్సెస్ రహస్యం చిన్న ఊళ్లలోని పేదింటి అమ్మాయిలే! ఏజెంట్ల ద్వారా సాఫీగా సాగుతున్న ఈ వ్యాపారం ఒకరింట సంతోషాన్ని పంచితే ఇంకొకరి ఇంట విషాదాన్ని నింపుతోంది. ఆ గాలానికి మనింటి అమ్మాయిలూ చిక్కొచ్చు! తస్మాత్ జాగ్రత్త.

రెగ్యులర్ అండ్ దివా
ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ఎగ్ డోనర్స్‌ను రెండురకాలుగా వర్గీకరించారు. ఒకటి.. సాధారణ దాతలు, రెండు.. దివా. వీళ్లు పేరున్న కుటుంబ నేపథ్యం, ఉన్నత చదువు, హోదా, చక్కటి రూపు, రంగు, మంచి ఆరోగ్యం, జన్యుపర వ్యాధుల చరిత్రలేని వారై ఉంటారు. ఈ దివా కేటగిరి డోనర్స్ సాధారణంగా ఒక్క డొనేషన్‌కు లక్ష నుంచి మూడు లక్షల రూపాయాల దాకా డిమాండ్ చేస్తారు. ఇక సాధారణ దాతలు ఒక్క డొనేషన్‌కు 25 వేల నుంచి 35 వేల రూపాయలు తీసుకుంటారు.

పరస్పర విరుద్ధం
ముంబైలో సుష్మపాండే మరణం తర్వాత ఏఆర్‌టీ బిల్ వచ్చింది. అయితే ఇది మెడికల్ యాక్ట్‌కి క్లాష్ అవుతోంది కూడా. కారణం ఆర్గాన్ డొనేషన్‌కి, ఏఆర్‌టీ బిల్‌కి పరస్పర వైరుద్ధ్యం ఉండడమే. ఆర్గాన్ డొనేషన్‌బిల్ ప్రకారం అవయవాలను దానం చేసేవారు రక్తసంబంధీకులై ఉండాలి. అదే ఎగ్ డొనేషన్‌కి సంబంధించి ఇలాంటి నియమేమీ లేదు. ఇది ఏజంట్లకు మంచి అవకాశంగా మారింది. పేదరికంలో ఉన్న ఆడపిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇలాంటి జరగకూడదనే ఇప్పుడు ఏఆర్‌టీని కూడా మెడికల్‌యాక్ట్ కిందకి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  - ఎ.రమ్య కుమారి, హైకోర్ట్ అడ్వకేట్వివరించిన

తర్వాతే...

ఏ ఐవీఎఫ్ సెంటర్ అయినా ఐసీఎమ్మార్ గైడ్‌లైన్స్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో కావాల్సిందే. దానిప్రకారం ఎగ్ డొనేషన్‌కి కూడా 21 ఏళ్లు నిండిన అమ్మాయిలనే ప్రిఫర్ చేస్తాం. ఇంకా చెప్పాలంటే పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయిన వాళ్లకే ప్రాధాన్యం ఇస్తాం. ఎగ్ డొనేషన్ ప్రాసెస్ ఏంటో కూడా డోనర్‌కి, ఆమె హజ్బెండ్‌కి వివరిస్తాం. అన్నీ విని వాళ్లు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే తీసుకుంటాం. ఏజెంట్లు ప్రిఫర్ చేసిన అమ్మాయిల ఏజ్ గ్రూప్‌నూ వాళ్ల ఆధార్‌కార్డ్ ద్వారా నిర్ధారించుకుంటాం. మైనర్ పిల్లలను ఎగ్‌డొనేషన్‌కు అనుమతించం. అనుమతించకూడదు కూడా  - డాక్టర్ సరోజా కప్పాలా,  నోవా ఫెర్టిలిటీ సెంటర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement