పత్తాలేని క్రాంగెస్ | Partition among the guilty | Sakshi
Sakshi News home page

పత్తాలేని క్రాంగెస్

May 18 2014 1:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

పత్తాలేని క్రాంగెస్ - Sakshi

పత్తాలేని క్రాంగెస్

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ కళావిహీనమైంది. జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామమాత్రపు...

  •    విభజనతో ప్రజల్లో దోషి
  •   ఆరు దశాబ్దాల తర్వాత ప్రాతినిధ్యం లేకుండా పోయిన వైనం
  •  ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ కళావిహీనమైంది. జిల్లాలో నామరూపాలు లేకుండాపోయింది. మున్సిపల్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నామమాత్రపు ఫలితాలు రాబట్టుకున్న పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో  పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎక్కడా డిపాజిట్లు రాని పరిస్థితి నెలకొంది. 1952 నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేని సందర్భం లేదు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి జిల్లా నుంచి ఆ పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీలు లేకుండాపోవడం గమనార్హం.
     
    సాక్షి, విజయవాడ : జిల్లా నుంచి గత ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ప్రజారాజ్యం విలీనం కావడంతో ఆ పార్టీ నుంచి గెలి చిన ఇద్దరితో కలిపి  కాంగ్రెస్  బలం ఎనిమిదికి చేరింది. ఈ సారి వారిలో ఎవరూ గెలుపొందలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉన్న ఐలాపురం వెంకయ్య, పాలడుగు వెంకట్రావ్‌లే దిక్కయ్యారు.

    రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్  ఏకపక్షంగా వ్యవహరించిన తీరు ఆ పార్టీని నిలువునా ముంచేసింది. ఎమ్మెల్యేలుగా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసినా ‘హస్తం’ గుర్తుపై ఓటు వేయడానికి జిల్లా ప్రజలు ఇష్టపడకపోవడంతో తాజా మాజీలు కూడా డిపాజిట్లు కోల్పోవాల్సివచ్చింది. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ పూర్వ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఒక్కరే డిపాజిట్ దక్కించుకోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
     
    తాజీ మాజీలకు తప్పని తిప్పలు..


    విజయవాడ లోకసభకు పోటీ చేసిన దేవినేని అవినాష్ 39,746 ఓట్లతో సరిపెట్టుకోవాల్సిరాగా, చివరివరకు అభ్యర్థి దొరకని మచిలీపట్నంలో శిష్ట్లారమేష్‌కు 14,111 ఓట్లు మాత్రమే వచ్చాయి. కృష్ణాజిల్లాలో ముగ్గురు తాజా మాజీలు, ఒక మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగారు. వీరిలో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు 8,744 ఓట్లు సాధించగా, పామర్రు మాజీ ఎమ్మెల్యే డి.వై.దాస్ 8,237 ఓట్లు సాధించారు.

    గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నూజివీడు మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్యకు కేవలం 1,964 ఓట్లు మాత్రమే వచ్చాయి. విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మాత్రం పదివేల సంఖ్యను దాటగలిగారు. ఆయనకు 12,911 ఓట్లు వచ్చాయి.

    పెనమలూరు అభ్యర్థి శోభన్‌బాబుకు 3,336 ఓట్లు రాగా, గుడివాడ నుంచి పోటీ చేసిన అట్లూరి సుబ్బారావుకు 3,103 ఓట్లు, అవనిగడ్డ నుంచి పోటీ చేసిన మత్తి వెంకటేశ్వరరావుకు 2,091 ఓట్లు, గన్నవరం నుంచి పోటీ చేసిన సుంకర పద్మశ్రీ భక్తాకు 2,500 ఓట్లు, పెడన నుంచి పోటీ చేసిన పిన్నింటి విశ్వేశ్వరరావు అతి తక్కువగా 950 ఓట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

    జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన వేముల నాగేశ్వరరావుకు 1,978, మచిలీపట్నం నుంచి పోటీ చేసిన చలమలశెట్టి ఆదికిరణ్‌కు 1,212 ఓట్లు, మైలవరం నుంచి పోటీ చేసిన అప్పసాని సందీప్‌కు 2,927 ఓట్లు, నందిగామ నుంచి పోటీ చేసిన వేల్పుల పరమేశ్వరరావుకు 1,997 ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైనట్టేనని చెప్పక తప్పదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement