వైఎస్సార్ హయాంలోనే రైతుకు భరోసా | Ensuring to farmers in the during of ysr | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ హయాంలోనే రైతుకు భరోసా

Apr 19 2014 12:19 AM | Updated on Jun 4 2019 5:04 PM

వ్యవసాయం దండగని టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. కాదు పండుగ అని చెప్పడమే కాదు నిరూపించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్ అన్నారు.

మెదక్ రూరల్, న్యూస్‌లైన్: వ్యవసాయం దండగని టీడీపీ అధినేత చంద్రబాబు అంటే.. కాదు పండుగ అని చెప్పడమే కాదు నిరూపించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని వైఎస్సార్ సీపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన మెదక్ అసెంబ్లీ అభ్యర్థి అల్లారం క్రీస్తుదాసుతో కలిసి మండలంలోని పాతూర్, అవుసులపల్లి, ఔరంగాబాద్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాతూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుగౌడ్ మాట్లాడుతూ రైతులకు రుణమాఫీ చేయడంతోపాటు ఉచిత విద్యుత్ అందించి వారి బతుకులకు భరోసా కల్పించారని గుర్తుచేశారు.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా జీఓ తీసుకొచ్చారన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి కుటుంబానికి వర్తించాయన్నారు. పేదలకు కార్పొరేట్ విద్యతోపాటు వైద్యాన్ని కూడా అందించినట్టు తెలిపారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను గుర్తించి ఇతర పార్టీలను చిత్తుగా ఓడించాలన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనతోపాటు మెదక్ అసెంబ్లీ అభ్యర్థి క్రీస్తుదాసును గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బద్దం వెంకటరాంరెడ్డి, జె.రాములు, గుట్ట మీది రమేశ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

 ఓటేసి రాజన్న రుణం తీర్చుకోండి..
 పాపన్నపేట: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటేసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రుణం తీర్చుకోవాలని ఆ పార్టీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి పి.ప్రభుగౌడ్ కోరారు. శుక్రవారం ఏడుపాయల దుర్గాభవానిమాతను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం నాగ్సాన్‌పల్లిలో విలేకరులతో మాట్లాడుతూ నిరుపేద ప్రజల కోసం జీవితాన్నే దారపోసిన మహా నేత వైఎస్ రుణం తీర్చుకోవాలంటే వైఎస్సార్ సీపీ అభ్యర్థులను ఆదరించాలన్నారు. తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందితేనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement