హైదరాబాద్లో చూసుకుందాం...రా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు.
మచిలీపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష పార్టీ నేతలపై ఏపీ సర్కార్ ....పోలీసు కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతోందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. మచిలీపట్నం పోర్టు భూ సేకరణ, ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన వైఎస్ఆర్ సీపీ నేత పేర్ని నానిపై అక్రమంగా మూడు కేసులు బనాయించి, జైలుకు పంపించారన్నారు. ఆయనకు పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని, ప్రభుత్వ వ్యతిరేక చర్యలపై రాబోయే రోజుల్లో తమ పోరాటం కొనసాగుతుందని కొడాలి నాని తెలిపారు.
చంద్రబాబుకు దమ్ముంటే చర్చకు రావాలని కోడాలి నాని సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే హైదరాబాద్లోనే చూసుకుందామని ఆయన అన్నారు. అక్కడ అయితే నిష్పక్షపాతంగా పోలీసులు వ్యవహరిస్తారని వ్యాఖ్యానించారు. ఇక పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే నెపంతో పోలీసులను తనపై ఉసిగొల్పారని, వారి బెదిరింపులకు, దౌర్జన్యాలకు భయపడేది లేదన్నారు.


