జిల్లావ్యాప్తంగా వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు.
వడదెబ్బకు ముగ్గురి మృతి
Apr 24 2017 12:36 AM | Updated on Sep 28 2018 3:41 PM
వెల్దుర్తి రూరల్ / తుగ్గలి / రుద్రవరం : జిల్లావ్యాప్తంగా వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఇందులో ఒకరు ఉపాధి కూలీ ఉన్నారు. వివరాలిలా ఉన్నాయి.. వెల్దుర్తి మండలం రామళ్లకోటకు చెందిన మీసాల ఎల్లమ్మ(55)భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందగా పుట్టింట్లోనే ఉంటోంది. రెండు రోజులుగా పొలంలో కంది కొయ్యలు కోసి కాల్చివేస్తోంది. ఇందులో భాగంగా శనివారం పొలంలో పని చేస్తుండగా ఎండ ధాటికి అస్వస్థతకు గురైంది. తర్వాత ఇంటికి వెళ్లి పడుకుంది. ఈక్రమంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచింది. ఇక తుగ్గలికి చెందిన చాకలి లక్ష్మన్న(37) శనివారం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని అనంతరం ఇంటికి రాగానే ఒక్కసారి సొమ్మసిల్లిపడిపోయాడు. స్థానికంగా చేయించుకున్నాడు. అయితే కోలుకోలేక ఆదివారం ఉదయం మృతి చెందాడు. అతడికి భార్య, కూతురు ఉన్నారు. అలాగే రుద్రవరం మండలం టి లింగందిన్నెకు చెందిన బీగాల రాముడు(65) వరి కోతల పనికి వెళ్లాడు. ఎండ కారణంగా అస్వస్థతకు గురికావడంతో ఇంటికి మంచంపై పడుకున్నాడు. కుటుంబ సభ్యులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు పిలిచినా లేవకపోడంతో వెళ్లి చూశారు. ఆయన అప్పటికే మృతి చెందడంతో బోరున విలపించారు. ఆయనకు ఐదుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు ఉన్నారు.
Advertisement
Advertisement