టీచర్ల బదిలీలకు గ్రీన్సిగ్నల్
రాయవరం(మండపేట): ఉపాధ్యాయ బదిలీలపై సుమారు నెల రోజుల పాటు కొనసాగిన ప్రతిష్ఠంబన తొలగింది. టీచర్ల బదిలీ ప్రక్రియ ఆది నుంచి ఒడిదుడుకులతో సాగింది. వెబ్ కౌన్సెలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్లను వ్యతిరేకిస్తూ వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు బదిలీల తీరు
ఎట్టకేలకు తొలగిన ప్రతిష్ఠంబన
షెడ్యూల్ విడుదలకు ప్రభుత్వం ఆమోదం
రాయవరం(మండపేట): ఉపాధ్యాయ బదిలీలపై సుమారు నెల రోజుల పాటు కొనసాగిన ప్రతిష్ఠంబన తొలగింది. టీచర్ల బదిలీ ప్రక్రియ ఆది నుంచి ఒడిదుడుకులతో సాగింది. వెబ్ కౌన్సెలింగ్, ప్రతిభ ఆధారిత పాయింట్లను వ్యతిరేకిస్తూ వచ్చిన ఉపాధ్యాయ సంఘాలు బదిలీల తీరును నిరశించాయి. ఉపాధ్యాయులు రోడ్డెక్కితేగాని ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపి కొన్ని సవరణలతో బదిలీ షెడ్యూల్ను విడుదల చేసేందుకు అంగీకరించింది. దీంతో ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు.
టీచర్ల నుంచి అభిప్రాయ సేకరణ
కొత్తగా బదిలీ షెడ్యూల్ ప్రకటించక ముందు ప్రభుత్వం ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. బదిలీలు వెబ్ కౌన్సెలింగ్లో చేపట్టాలా? మాన్యువల్ విధానంలో చేపట్టాలా? అంటూ ఫోన్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. అధిక శాతం మంది మాన్యువల్ విధానంలోనే బదిలీలు చేపట్టాలని కోరారు. చివరకు ప్రభుత్వం స్కూల్ అసిస్టెంట్లకు వెబ్ కౌన్సెలింగ్, ఎస్జీటీ క్యాడర్కు మాన్యువల్ విధానంలో బదిలీలు నిర్వహించేలా నిర్ణయించింది. ప్రతిభ ఆధారిత పాయింట్ల విధానంలోనూ మార్పులు తీసుకువస్తూ విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ మార్పులు జరగనున్నాయి...
ఈ నెలలో బదిలీలు చేపట్టేందుకు మంత్రి అంగీకరించారు. దీని ప్రకారం సవరణలతో బదిలీ షెడ్యూల్ను అధికారికంగా విద్యాశాఖ విడుదల చేయాల్సి ఉంది. మొత్తం మీద బదిలీ జీవోలు 32, 38కి అనేక సవరణలు చేస్తూ జీవో 43ను విడుదల చేశారు. జీవో 32లోని రూల్ 15లో వెబ్ అసిస్టెడ్, వెబ్ బేస్డ్, ఆన్లైన్ అనే పదాలను తొలగించారు. ప్రతిభ ఆధారిత పాయింట్లను 30 శాతానికి కుదించారు. ఎన్రోల్మెంట్, ట్రాన్సిషన్ పాయింట్లను పూర్తిగా తొలగించారు. కేటగిరీ 1, 2, 3, 4లకు వరుసగా 1, 2, 3, 5 పాయింట్లను కేటాయిస్తారు. మధ్యాహ్న భోజన పథకం పాయింట్లను అందరూ టీచర్లకు సమానంగా ఇవ్వనున్నారు. 1–9 తరగతులు బోధించే వారికి సీసీఈ, శ్లాస్, త్రీఆర్ఎస్ మార్కుల మేరకు వారు బోధించిన తరగతుల సగటు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. సీసీఈ, శ్లాస్, త్రీఆర్స్ డేటా మార్కులు అప్లోడ్ కాని మండలాలు, పాఠశాలల ఉపాధ్యాయులకు జిల్లా సగటు ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. రేషనలైజేషన్లో ఎఫెక్ట్ అయ్యే వారికి మూడు పాయింట్లు ఇస్తారు. 2015లో రేషనలైజేషన్కు గురైన వారు తిరిగి రేషనలైజేషన్లో వెళ్లాల్సి వస్తే వారికి గత కౌన్సెలింగ్ పాయింట్లు కొనసాగిస్తారు. ఏజెన్సీలో హిల్టాప్పై ఉన్న పాఠశాలలను కేటగిరీ–4గా గుర్తిస్తారు. కౌన్సెలింగ్ సమయంలో జూలై 31 నాటికి ఉన్న ఖాళీలన్నీ చూపిస్తారు. 2019 జూలై 31లోపు పదవీ విరమణ చేసే వారికి బదిలీల్లో మినహాయింపు ఇస్తారు.