
నడిరోడ్డుపై నరికేశారు
టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ(52)ను శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు.
►కత్తులతో విచక్షణా రహితంగా నరికిన దుండగులు
► పట్టపగలు గోపాలకృష్ణ హత్యతో ఉలిక్కిపడ్డ కొవ్వూరు పట్టణం
► పోలీసుల అదుపులో నిందితులు
కొవ్వూరు : టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు, 16వ వార్డు కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ(52)ను శుక్రవారం మధ్యాహ్నం ఇద్దరు దుండగులు అతి కిరాతకంగా నరికి చంపారు. కత్తులతో విచక్షణా రహితంగా మెడ, భుజం, చేతులపై నరకడంతో గోపాలకృష్ణ ఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచారు. కొవ్వూరు- నిడదవోలు రహదారిలో రోడ్డు కం రైలు వంతెన దాటిన తర్వాత ఉన్న మలుపులో ఈ దారుణం చోటు చేసుకుంది. మంకీ క్యాప్లు ధరించి మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కొవ్వూరు పట్టణం ఈ ఘటనతో ఉలిక్కిపడింది.
సమాచారం ఇచ్చిన ఆటో డ్రైవర్లు!
పట్టణంలో వివాహ విందు భోజనం చేసి తిరిగి మోటారు సైకిల్పై మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఔరంగబాద్లోని స్వగృహానికి వెళుతుండగా గోపాలకృష్ణ హత్యకు గురయ్యారు. దుండగులు హత్యకు పాల్పడుతున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఆటో డ్రైవర్ గుర్తించినట్టు సమాచారం. ఒక వ్యక్తి హత్యకు గురై రోడ్డుపై పడి ఉన్నట్టు ఆ డ్రైవరే ఔరంగబాద్లో స్థానికులకు చెప్పి వెళ్లి పోయినట్టు చెబుతున్నారు. హత్య జరిగిన సమయంలో కొవ్వూరు వైపు వస్తున్న మరో ఆటో డ్రైవర్ గుర్తించి టోల్గేట్ జంక్షన్లో ఆటోస్టాండ్కు సమాచారం అందించినట్టు తెలిసింది. విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చేసరికే గోపాలకృష్ణ ప్రాణాలు కోల్పోయినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కాగా ఘటనా స్థలంలో నిందితులు ఉపయోగించినట్టుగా భావిస్తున్న మంకీ క్యాప్ ఒకటి లభ్యం కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
శనివారం బంద్కు పిలుపు
ఎప్పుడు ప్రశాంతంగా ఉండే కొవ్వూరులో గోపాలకృష్ణ హత్య ఉదాంతం కలకలం రేపింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నామని బీసీ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి వెంకటేశ్వరరావు ఆరోపించారు. దోషులను సత్వరం అరెస్ట్ చేయాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీ, వర్తక సంఘాలు గోలపాకృష్ణ మృతికి సంతాపంగా కొవ్వూరు పట్టణం బంద్కి పిలుపునిచ్చారు. శనివారం వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసి వేయాలని నిర్ణయించారు.
డీఎస్పీతో ఎమ్మెల్యే వాగ్వాదం
పోలీసులు వైఫల్యం మూలంగానే గోపాలకృష్ణ హత్యకు గురైనట్టు ఎమ్మెల్యే కేఎస్ జవహార్ ఆరోపించారు. తనకు ప్రాణహానీ ఉందని గోపాలకృష్ణ పలుమార్లు చెప్పినా పోలీసులు ఎందుకు రక్షణ కల్పించలేదని ప్రశ్నించారు. తనతో ఎప్పుడూ గోపాలకృష్ణ చెప్పలేదని, ప్రాణహాని ఉందని ఎవరి నుంచి తమకు ఏ విధమైన ఫిర్యాదులు అందలేదని డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి డీఎస్పీ కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదివైపు వెళ్లి అక్కడే ఉన్న తనకారులో ఫోన్ మాట్లాడుతున్న సమయంలో ఎమ్మెల్యే జవహార్, టీడీపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు.
టీడీపీ నాయకులు డీఎస్పీ కారుకి అడ్డుగా నిలబడ్డారు. తామంతా ఆసుపత్రి వద్ద ఉంటే మీరు కారులో ఫోన్ మాట్లాడుకుంటారా అంటూ ఎమ్మెల్యే డీఎస్పీపై మండిపడ్డారు. నా మాట మీకు లెక్కలేకుండా ఉంద ంటూ ఆగ్రహంతో కేకలు వేశారు. గోపాలకృష్ణకు ప్రాణ రక్షణ కల్పించాలని బాధితులు మీ కార్యాలయానికి వచ్చి వేడుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎప్పుడు తన కార్యాలయానికి ఎవరూ రాలేదని డీఎస్పీ పేర్కొన్నారు. చివరకు డీఎస్పీ తన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే క్షమిచండి అనడంతో సమస్య సద్దు మణిగింది.
ఇద్దరు నిందితులను గుర్తించాం : ఎస్పీ
కొవ్వూరు : కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించామని ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. శుక్రవారం రాత్రి కొవ్వూరు విచ్చేసిన ఆయన ఘటనా స్థలాన్ని, ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం నేర పరిశోధన పోలీస్ స్టేషన్ వద్ద ఆయన విలేకర్లతో మాట్లాడారు. స్థానిక టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్న వ్యక్తులు కాదని, స్థానికులే ఈ హత్యకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు. కేసు పూర్తి వివరాలు శనివారం వెల్లడిస్తామన్నారు. హత్య కేసును గంట వ్యవధిలోనే ఛేదించిన డీ ఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.
మూడు సార్లు కౌన్సిలర్గా పాగా వేసిన ‘పాకా’
పురపాలక సంఘంలో పాకా గోపాలకృష్ణ కౌన్సిలర్గా మూడోసారి కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ కొవ్వూరు పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీసీల్లో బలమైన నాయకుడిగా గోపాలకృష్ణకు పేరు ఉంది. కిరాణా అండ్ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ట్రాన్స్పోర్టు, బియ్యం, సిమెంట్ అండ్ ఐరన్, ఎర్త్ మూవర్స్ వ్యాపారాలున్నాయి. ఎమ్మెల్యే కేఎస్ జవహార్, మునిసిపల్ చైర్మన్ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్(చిన్ని), టీడీపీ రాష్ట్ర నాయకుడు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణ, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు పోట్రు శ్రీనివాస్, పలు పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు గోపాలకృష్ణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు ఆర్పించారు. వివాద రహితుడుగా పేరున్న గోపాలకృష్ణ మృతిపై వారు తీవ్ర సంతాపం తెలిపారు.