విద్యార్థిని బలిగొన్న ఈత సరదా | student died in pond at batasingaram | Sakshi
Sakshi News home page

విద్యార్థిని బలిగొన్న ఈత సరదా

Oct 1 2016 10:49 PM | Updated on Sep 4 2017 3:48 PM

మనోజ్ కుమార్ (ఫైల్)

మనోజ్ కుమార్ (ఫైల్)

చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు.

పెద్దఅంబర్‌పేట: చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. హయత్‌నగర్‌ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన మనోజ్‌కుమార్‌(16), ఆదిత్య, శ్రీకాంత్, ధానోజ్, శ్రీను, సాయికిరణ్‌  బాల్యమిత్రులు. వీరంతా హైదరాబాద్‌ పరిసరాల్లో ఉంటూ వివిధ కళాశాలల్లో డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతున్నారు.  బాటసింగారం గ్రామ పరిధిలోని అన్నమాచార్య కళాశాలలో చదువుతున్న ఆదిత్యను కలిసేందుకు మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాలలో డిప్లొమా చదువుతున్న మనోజ్‌కుమార్‌తో సహా మిగతా నలుగురూ శుక్రవారం వచ్చారు.

ఆదిత్య ఉంటున్న హాస్టల్‌కు సమీపంలో ఉన్న బాట సింగారం చెరువు వద్దకు మధ్యాహ్నం వచ్చి.. కట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం మనోజ్‌కుమార్‌ చెరువులోకి దిగి మిగిలిన మిత్రులను పిలిచాడు. వారిలో ఆదిత్య అనే విద్యార్థిని మనోజ్‌ చెరువులోకి బలవంతంగా లాగాడు. మనోజ్‌ చెరువులో దిగినప్పటి నుంచి ఆ దృశ్యాలను మిత్రులు సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరిస్తున్నారు. ఈత రాని మనోజ్, ఆదిత్యలు చెరువులో మునిగిపోతుండటం గమనించి రక్షించేందుకు యత్నిం చారు.

ఆదిత్యను బయటకు తీయగా, మనోజ్‌ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అప్పటికే చీకటి పడటంతో మనోజ్‌ జాడ కనిపించలేదు. శనివారం ఉదయం ఇన్ స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్, ఎస్‌ఐలు శ్రీనివాస్, కిరణ్‌కుమార్‌ వచ్చి ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టగా మనోజ్‌కుమార్‌ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement