breaking news
Manojkumar
-
'వండర్లా'లో అపశ్రుతి.. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి..
రంగారెడ్డి: వండర్లాలో అపశ్రుతి చోటుచేసుకుంది. రైడ్స్ చేస్తుండగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ సంఘటన రావిర్యాల్ సమీపంలోని వండర్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా కాశీంకోట మండలం తాళ్లపాలెం గ్రామానికి చెందిన గుమ్మడి మనోజ్కుమార్(26) కూకట్పల్లిలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో స్నేహితులు దుర్గప్రాసాద్, వరప్రసాద్, గణేశ్, శ్రీకాంత్, ప్రశాంత్తో కలిసి వండర్లాకు వెళ్లారు. జాయింట్ వీల్ పూర్తి చేసి రోలర్ క్యాస్టు రైడ్ చేస్తుండగా మనోజ్కుమార్కు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే వండర్లాలోని ఫస్ట్ ఎయిడ్ సెంటకు తీసుకెళ్లగా ట్యాబ్లెట్ ఇచ్చి పడుకోబెట్టారు. అప్పటికే పల్స్ రేట్ తగ్గిపోయి చల్లబడిపోయాడు. హార్ట్ బీట్ సరిగా లేదని స్నేహితులు గమనించే సరికి అంబులెన్స్లో యంజాల్ సమీపంలోని మహోనియా అస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో గాంధీకి తరలించారు. అప్పటికే మనోజ్ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఆదిబట్ల పోలీసులు విచారణ చేస్తున్నారు. మనోజ్కుమార్ మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
విద్యార్థిని బలిగొన్న ఈత సరదా
పెద్దఅంబర్పేట: చిన్ననాటి స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి చెరువులో మునిగి మృతి చెందాడు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన మనోజ్కుమార్(16), ఆదిత్య, శ్రీకాంత్, ధానోజ్, శ్రీను, సాయికిరణ్ బాల్యమిత్రులు. వీరంతా హైదరాబాద్ పరిసరాల్లో ఉంటూ వివిధ కళాశాలల్లో డిప్లొమా ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. బాటసింగారం గ్రామ పరిధిలోని అన్నమాచార్య కళాశాలలో చదువుతున్న ఆదిత్యను కలిసేందుకు మీర్పేటలోని టీకేఆర్ కళాశాలలో డిప్లొమా చదువుతున్న మనోజ్కుమార్తో సహా మిగతా నలుగురూ శుక్రవారం వచ్చారు. ఆదిత్య ఉంటున్న హాస్టల్కు సమీపంలో ఉన్న బాట సింగారం చెరువు వద్దకు మధ్యాహ్నం వచ్చి.. కట్టపై కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం మనోజ్కుమార్ చెరువులోకి దిగి మిగిలిన మిత్రులను పిలిచాడు. వారిలో ఆదిత్య అనే విద్యార్థిని మనోజ్ చెరువులోకి బలవంతంగా లాగాడు. మనోజ్ చెరువులో దిగినప్పటి నుంచి ఆ దృశ్యాలను మిత్రులు సెల్ఫోన్లో వీడియో చిత్రీకరిస్తున్నారు. ఈత రాని మనోజ్, ఆదిత్యలు చెరువులో మునిగిపోతుండటం గమనించి రక్షించేందుకు యత్నిం చారు. ఆదిత్యను బయటకు తీయగా, మనోజ్ అప్పటికే నీటిలో మునిగిపోయాడు. ఆందోళనకు గురైన విద్యార్థులు పోలీసులకు తెలిపారు. అప్పటికే చీకటి పడటంతో మనోజ్ జాడ కనిపించలేదు. శనివారం ఉదయం ఇన్ స్పెక్టర్ నరేందర్గౌడ్, ఎస్ఐలు శ్రీనివాస్, కిరణ్కుమార్ వచ్చి ఈతగాళ్లతో చెరువులో గాలింపు చేపట్టగా మనోజ్కుమార్ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మృత్యువులోనూ చేయికలిపి..
శివరాత్రి స్నానాలకెళ్లి మృత్యువాత ఇద్దరు మృతితో దివిసీమలో విషాదఛాయలు శివరాత్రి పర్వదినం..నదిలో స్నానాలు ఆచరించడం సంప్రదాయం. ఆ ముగ్గురూ నదిలో పుణ్య స్నానాలకు దిగారు.. నీళ్లు అల్లరి పెడుతుంటే ఆనందంతో మరింత లోతుకు వెళ్లారు.. సరదా గడిపిన యువకులను మృత్యువు వెంబడించింది.. ముగ్గురూ చెల్లాచెదురయ్యూరు.. వీరిని గమనించిన స్థానికులు ఒకరి ప్రాణాలను నిలబెట్టగలిగారు.. ఆ ఇద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని నదీ గర్భంలో కలిసి శివైక్యమయ్యూరు. పాత ఎడ్లంక (అవనిగడ్డ) పుణ్యస్నానాలకు వెళ్లి.. కృష్ణానదిలో స్నానం చేసేందుకు స్నేహితులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్కుమార్, సింహాద్రి సాయినవీన్ దిగారు. సరదాగా ఈత వేస్తున్నారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోయారు. సాయినవీన్ను అంబేడ్కర్ కాపాడి ఒడ్డుకు చేర్చాడు. ఇద్దరి కోసం వెతుకులాడే ప్రయత్నంలో అంబేడ్కర్ కూడా ఆపాయంలో చిక్కుకుని కేకలు వేయడంతో గజ ఈతగాళ్లు రక్షించారు. మునిగిన ఇద్దరి కోసం గజ ఈతగాళ్లు గాలించారు. ఆచూకీ దొరకలేదు. దీంతో వలతో సుమారు 500 మీటర్లు గాలించడంతో రమణ, మనోజ్కుమార్ కుమార్ మృతదేహాలు దొరికాయి. స్నానాలకు వెళ్లొదని చెప్పినా.. శివరాత్రి స్నానాలకు వెళ్ళొద్దని చెప్పినా వినకుండా వెళ్లి విగత జీవిగా వచ్చావా నాయనా అంటూ మనోజ్కుమార్ కుటుంబ సభ్యులు విలపించారు. కుమార్ అవనిగడ్డ జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బతకను తమ్ముడూ అంటూ సోదరుడు పవన్కుమార్ విలపించారు. మనోజ్కుమార్ తండ్రి బసవపున్నారావు స్థానిక వెల్డింగ్ షాపులో పనిచేస్తుండగా సోదరుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి రమేష్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, ఎస్సీసెల్ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు నలుకుర్తి రమేష్, డీఎస్పీ ఖాదర్బాషా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మత్యుంజయుడు సాయినవీన్ సింహాద్రి సాయినవీన్ మృత్యుంజయుడిగా బ యట పడ్డాడు. మిత్రులు పువ్వాడ రమణ, నడకుదిటి మనోజ్కుమార్తో కలిసి కృష్ణానదిలోకి స్నా నాలకు వెళ్లిన ఈ ముగ్గురూ మునిగిపోయారు. అం బేడ్కర్ మునిగిపోయిన సాయినవీన్ని కాపాడాడు. ప్రమాదాన్ని గుర్తించి ఉంటే.. ముగ్గురు యువకులు మునిగిపోయినప్పుడే చూసిన వారు చెప్పి ఉంటే గజ ఈతగాళ్లు కాపాడేవారే. అంబేడ్కర్ని కాపాడిన తరువాత మరొకరు ఉన్నారని చెప్పారు. అప్పటికే 15 నిముషాలు గడచిపోయింది. గజ ఈతగాళ్ళకు అంబేడ్కర్ చేయి కనబడటంతో వెంటనే రక్షించ గలిగారు. ఆ సమయంలో గల్లంతైన ఇద్దరి గురించి చెప్పి ఉంటే వారిని రక్షించే వారమని గజ ఈతగాళ్లు చెప్పారు. రమణ కుటుంబంపై పగబట్టిన విధి.. రమణ తండ్రి కోటేశ్వరరావు పదేళ్ల క్రితం చనిపోగా, తల్లి నాగరత్నం నాలుగేళ్ల క్రితం మరణించింది. నలుగురు వివాహిత కూతుళ్లుండగా రమణ ఒక్కడే మగపిల్లవాడు. తల్లిదండ్రులు చనిపోయినా అక్క వద్ద ఉంటూ నాగాయలంకలో మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నాడు. రమణ శివరాత్రి స్నానాలకు వచ్చి మృత్యువు పాలవ్వడంతో సోదరి కొల్లూరి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద విలపిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. రక్షించబోయి.. ప్రమాదం నుంచి బయటికి.. పాత ఎడ్లంక(అవనిగడ్డ) : ప్రమాదంలో యువకులను కాపాడే ప్రయత్నంలో అంబేడ్కర్ ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించడంలో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈత వేస్తు ముగ్గురు యువకులు మునిగిపోతుండగా గుర్తించిన అంబేడ్కర్ అందులో సింహాద్రి సాయినవీన్ను కాపాడాడు. మిగిలిన ఇద్దరిని రక్షించేందుకు నదిలో దిగాడు. కాని లోతు అందకపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నాడు. గజ ఈతగాళ్లు రక్షించారు. ఎస్ఐ వెంకటకుమార్, జెడ్పీటీసీ సభ్యుడు కొల్లూరి వెంకటేశ్వరరావు కలిసి మచిలీపట్నం తరలించారు.